బిల్లులకు ఆమోదం, గందరగోళం: సభ నుంచి జగన్ వెనుకే రోజా బయటకు.., ఫ్లైట్ టైం అవుతోందనే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనల మధ్య మంగళవారం ద్రవ్య వినిమియ బిల్లును ఆమోదించారు. దీంతో పాటు పలు బిల్లులు ఆమోదించారు. ఈ సమయంలో సభలో గందరగోళం చెలరేగింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనల మధ్య మంగళవారం ద్రవ్య వినిమియ బిల్లును ఆమోదించారు. దీంతో పాటు పలు బిల్లులు ఆమోదించారు. ఈ సమయంలో సభలో గందరగోళం చెలరేగింది.
రోజాపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు
ఓ వైపు బిల్లులు ఆమోదిస్తుండగా, మరోవైపు వైసిపి సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. పదో తరగతి పరీక్షా ప్రశ్న పత్రం లీకేజీపై చర్చించాలని పట్టుబట్టారు. వైసిపి సభ్యులు సభను అడ్డుకోవడం సరికాదని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు.
సీమను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం
అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరిస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతోందని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమలో రెండో రాజధానిని నిర్మించాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అనంతకు వచ్చిన ఎయిమ్స్ను మంగలఘిరికి మార్చారని, సీమను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిరోజూ స్పీకర్ వెల్లోకి వెళ్లి ఆందోళన చేయడం సరికాదని ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ అంతకుముందు అన్నారు. పదో తరగతి లీకేజీపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడారు. వైసిపి ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. నిన్న సభలో 12 బిల్లులు ప్రవేశపెడితే చర్చకు ముందుకు రాలేదని, జల దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేస్తుంటే సభ నుంచి వెళ్లిపోయారన్నారు.
సభ నుంచి బయటకు జగన్.. ఆ వెనుకే రోజా
వైసిపి సభ్యుల నిరసనల మధ్యే పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులన్నింటినీ స్పీకర్ ఆమోదించారు. ఈ సమయంలో జగన్, ఎమ్మెల్యే రోజా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో, జగన్ పైన అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.
హైదరాబాదుకు వెళ్లడానికి జగన్కు సాయంత్రం 4.30 గంటలకు ఫ్లైట్ ఉందని, అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలను సైతం పక్కన పెట్టి, వెళ్లిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు రావడానికి కూడా ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి 8.40కి ఫ్లైట్లో బయలుదేరి 10.30కి ఇక్కడకు చేరుకుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్లడానికి ఆయనకు ఫ్లైట్ టైమ్ అవుతోందని, అందుకే ప్రశాంతంగా సభ నుంచి వెళ్తున్నారన్నారు.