మాగంటి బాబును ఏపీ సీఎం చంద్రబాబు నియంత్రించగలరా?
హైదరాబాద్: ఆడంబరానికి మారుపేరు ఆ ఎంపీ. ఆయన పేరు మాగంటి బాబు అలియాస్ వెంకటేశ్వర్రావు. సరిదిద్దడానికి వీలు లేని స్థాయిలో ఆయన వ్యక్తిత్వం రూపు దిద్దుకున్నదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల కేవలం పార్టీకే కాదు.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఇబ్బందులు తలెత్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆడంబరమైన జీవన విధానానికి మారుపేరు మాగంటి బాబు అని ప్రతీతి.
కైకలూరులోని ఆయన కార్యాలయాన్ని పేకాట క్లబ్గా మార్చేయడంతో మరోసారి మాగంటి బాబు వివాదంలో చిక్కుకున్నారు. కానీ ఆయనను తాకేందుకు ఏ ఒక్క పోలీసు అధికారి కూడా సాహసించరంటే అతిశయోక్తి కాదు.
చూసీ చూడనట్లు వదిలేయాలన్న సీఎం చంద్రబాబు
సంక్రాంతి పండుగ నేపథ్యం పేరుతో ఆయన కార్యాలయంలోనే పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారన్న సంగతి తాజాగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో తేలింది. ఈ పేకాట ఆడాలని భావించే వారు సభ్యులుగా చేరడానికి రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ డెన్లో రూ.5 లక్షలకు తక్కువ కాకుండా తీసుకెళ్లాల్సిందే. దీనికి సంబంధించిన చర్యలు తీసుకునే ధైర్యం లేక పోలీసు అధికారులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ రూ. 5 కోట్లు తగ్గకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ పేకాట డెన్లో 24 గంటల పాటు ఆడుతున్నారు. మాగంటి బాబు అలియాస్ వెంకటేశ్వరరావు లావాదేవీలను తన ద్రుష్టికి తెచ్చిన పోలీసు అధికారులతో.. చూసీ చూడనట్లు వదిలేయాలని సీఎం చంద్రబాబు నాయుడు హితవు చెప్పినట్లు సమాచారం. అంతే కాదు సంక్రాంతి సందర్భంగా మాగంటి బాబు భారీ ఎత్తున కోడి పందాలు కూడా నిర్వహిస్తుంతారు. వీటికి అదనంగా స్థానిక బాలికలతో, యువతులతో డ్యాన్స్ చేయిస్తుంటారు.
2007 - 09 మధ్య వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా సేవలు
తొలిసారి 1998 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్కు ఎన్నికైన మాగంటి వెంకటేశ్వరరావు మళ్లీ 16 ఏళ్ల తర్వాత 2014లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. అంతే కాదు వ్యవసాయ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు కూడా. 2004 - 09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా పని చేసిన మాగంటి బాబు.. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కొద్దికాలం 2007 - 09 మధ్య పని చేశారు. 2009 ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది కూడా తదుపరి సుదీర్ఘ కాలంగా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ‘మాగంటి' కుటుంబం తుంచేసుకున్నది. మంత్రి పదవిని కోల్పోయిన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిన మాగంటి బాబు.. తన కుటుంబానికి దాదాపు ఎనిమిది దశాబ్దాల అనుబంధానికి తిలోదకాలిచ్చేశారు.
ఉప్పు సత్యాగ్రహంతో జైలుకు వెళ్లిన బాబు తాత
నెహ్రూ - గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీలతో తొలి నుంచి అనుబంధం గల అనుబంధం తొలిగి పోయింది. మాగంటి బాబు తాత మాగంటి సీతారాం దాస్.. నాడు జాతిపిత మహాత్మాగాంధీ పిలుపును అందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 30వ దశకంలోనే జైలు పాలయ్యారు. గాంధీజీతోపాటు ప్రస్తుతం ఏలూరు నగర శివారుల్లోని చతాపారు గ్రామంలోని మాలపల్లిలో వీధులు శుభ్రపరిచిన సంగతి స్థానికులు గుర్తుంచుకుంటారు. మద్రాస్ ఉమ్మడి అసెంబ్లీకి ఎంపికైన సీతారాం దాస్.. కాంగ్రెస్ చీఫ్ విప్గా పని చేశారు. తర్వాత సీతారాం దాస్ తనయుడు మాగంటి రవీంద్ర నాథ్ చౌదరి.. చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా పని చేశారు. 1990లో నేదురుమల్లి జనార్దన రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేసిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి.. అదే రోజు హఠాన్మరణానికి గురయ్యారు. తర్వాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి భార్య వరలక్ష్మి మంత్రిగా పని చేశారు.
1994లో ఇలా అధికారంలోకి టీడీపీ
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, వరలక్ష్మి వారసుడే మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు. అంతేకాదు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి మధ్య వైరం ఉండేది. 1980వ దశకంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, నాటి సీఎం ఎన్టీఆర్.. చౌక బియ్యం పథకం అమలు కోసం ఎక్సైజ్ శాఖ ద్వారా భారీ నిధులు సమకూర్చుకోవడం కోసం సారా కాంట్రాక్టుల్లో వేలం కోసం పోటీలు పెంచారు. తర్వాత 1994లో అధికారం కోసం ప్లస్ మధ్య నిషేధం అమలు ద్వారా.. ఒక ప్రధాన పత్రికను దెబ్బతీసే లక్ష్యంతో అప్పటి టీడీపీ ముందుకు సాగింది. దానికి మరో ప్రధాన పత్రిక పూర్తిగా సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేసిన మాగంటి బాబు.. 2014లో తెలంగాణ విభజన పుణ్యమా? అని అప్పటి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు టీడీపీలో చేరకుండా అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.