APHRC : కర్నూల్లో హెచ్చార్సీ కార్యాలయం ప్రారంభం-న్యాయరాజధానిలో రెండో ఆఫీసు
ఏపీలో మానవ హక్కుల కమిషన్ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ లోనే ఉండిపోయిన హెచ్చార్సీ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏపీకి తరలించింది. ఇప్పుడు దాన్ని న్యాయరాజధాని అయిన కర్నూల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి నుంచి సేవల్ని అధికారికంగా ప్రారంభించారు.
కర్నూలులోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ప్రారంభమైంది. రూమ్ నెంబర్-1లో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఛాంబర్ ఏర్పాటు చేశారు. రూమ్ నెంబర్ - 2 లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఛాంబర్ ఇచ్చారు. రూమ్ నెంబర్ -4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు ఛాంబర్ కేటాయించారు. హెచ్చార్సీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఉండిపోయిన మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని రాష్ట్రానికి తరలించేందుకు గత చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత జగన్ సర్కార్ కుడా చర్యలు తీసుకోలేదు. దీంతో హెచ్చార్సీ తరలింపుపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు గతంలో దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పటికే రాజధానుల తరలింపులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్ని కర్నూలుకు మార్చేందుకు ప్రణాళికలు వేసిన ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో వేగంగా స్పందించింది.
Recommended Video
వెంటనే హైదరాబాద్ నుంచి కర్నూలుకు హెచ్చార్సీ తరలించేందుకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ కు మానవ హక్కుల సంఘం తరలించేందుకు మార్గం సుగమమైంది. ఇవాళ అక్కడ హెచ్చార్సీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కర్నూలుకు లోకాయుక్త కార్యాలయం కూడా రావడంతో న్యాయ రాజధానిలో హుషారు నెలకొంది. త్వరలో హైకోర్టుతో పాటు జ్యుడిషియల్ అకాడమీ, లా యూనివర్శిటీల్ని కూడా రప్పిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.