పవన్ కళ్యాణ్ దూకుడే: ఫెయిల్కూ రెడీ, కూటమితోనే
హైదరాబాద్: రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకన్నట్లు సమాచారం. జనసేనను ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేస్తే సీట్లు రావనే భయం తమకు లేదని ఆయన అన్నారు. ఓటమిని కూడా స్వాగతిస్తామని ఆయన అన్నారు.
పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే దానికి అనుభవం కావాలని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. రెండు మూడు సార్లు విఫలం కావడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం దేశసమగ్రతకు మంచిది కాదని ఆయన అన్నారు.
తన వద్ద ఏమైనా నిర్మాణాత్మక సూచనలు ఉంటే ఎన్డిఎ ప్రభుత్వానికి చెబుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డిఎ సభ్యుడిగా తనను కూర్చోబెట్టారంటే అది నరేంద్ర మోడీ ఘనత అని పవన్ కళ్యాణ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారంనాడు ఆయనను తీగల కృష్ణారెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ శానససభ్యులు, పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి కలిశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కూటమి బరిలోకి దిగుతుందని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ తరఫున ప్రచారం చేసినందుకు పవన్కు ఆయన కృతజ్ఞతులు తెలియజేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టిడిపి, బిజెపి, జనసేన కూటమి పోటీ చేసే విషయంపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, బిజెపి, జనసేన పార్టీలు కలవడంతో ఇంకా బలంగా తయారైందని ఆయన అన్నారు.