ఘర్షణల మధ్య సీమాంధ్రలో ముగిసిన పోలింగ్
హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకు పోలింగ్ మొదలైంది. దాదాపు 3.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లోకసభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, శాసనసభ స్థానాలకు 2,243 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 40,708 పోలింగ్ కేద్రాలను ఏర్పాటు చేశారు. 164 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మిగతా స్థానాల్లోని కొన్నింటిలో 4 గంటల వరకు, మరికొన్నింటిలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మొత్తం 77 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కన్నా పోలింగ్ స్వల్పంగా పెరిగింది. మొత్తం 80 శాతం పోలింగ్ నమోదు కావచ్చునని సిఇవో భన్వర్ లాల్ చెప్పారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 83 శాతం పోలింగ్ నమోదైంది.
కృష్ణా జిల్లాలో 80 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 78 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 79 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో 78 శాతం, ప్రకాశంలో 80 శాతం, నెల్లూరులో 73 శాతం, విశాఖలో 76 శాతం పోలింగ్ నమోదైంది. నెల్లూరు జిల్లాలో 73 శాతం, కడపలో 75 శాతం, కర్నూలులో 76 శాతం పోలింగ్ నమోదైంది. అనంతపురంలో 80 శాతం, చిత్తూరు జిల్లాలో 80 శాతం పోలింగ్ నమోదైంది.
ఘర్షణలు, పరస్పర ఆరోపణల మధ్య సీమాంద్రలోని 13 జిల్లాల్లో గల 25 లోకసభ స్థానాలకు, 175 శాసనసభా స్థానాలకు బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సీమాంధ్రలో 74 శాతం నమోదైంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో 72 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తన ఓటు కోసం రేవతి అనే మహిళ దీక్షకు దిగింది. తన ఓటును మరెవరో వేసేయడంతో ఆమె నిరసనకు దిగింది. తన కుమారుడి ఓటైనా వేయడానికి అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి రావి వెంకటరమణను ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో స్టే గడువు ముగియడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఇనగంటివారిపేటలో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బీసయ్య అనే వైసిపి కార్యకర్త మరణించాడు.
విశాఖపట్నం జిల్లా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలింగ్ను నాలుగు గంటలకే నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సీమాంధ్రలో 63 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం పలకజీడిలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు సిఇవో భన్వర్ లాల్ చెప్పారు. ఇక్కడ రెండు ఇవియంలను దుండగులు ఎత్తుకెళ్లారు. మావోయిస్టులే ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని బసికాపురం వద్ద నర్సారావుపేట లోకసభ అభ్యర్థి రాయపాటి సాంబశివ రావుపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గన్మెన్ సాయంతో ఆయన బయటపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డిని పోలీసులు అనంతపురం జిల్లా రాయదుర్గంలో అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన షాడో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, సినీ నటి రోజా నగరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు మరణించింది.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 42 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ తర్వాత జోరందుకుంది.
మైదుకూరు, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై వైసిపి దాడులను టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఓటమి భయంతోనే వైసిపి దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా అరుణ కుమారి చంద్రగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కడప జిల్లా రెడ్డివారిపల్లెలో వైసిపి, టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కడప జిల్లా దేవగుడిలో ఎఎస్పీపై దాడి జరిగింది. దీంతో పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. వైసిపి కార్యకర్తలు ఎఎస్పీపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
గుంటూరు జిల్లా రొంపిచర్లలో పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులో ఉందని సిఇసి భన్వర్ లాల్ చెప్పారు.
ఉదయం 11 గంటల వరకు సీమాంధ్రలో మొత్తం 33 శాతం పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43 శాతం పోలింగ్ నమోదైంది.
గుంటూరు జిల్లా పెద్దఅగ్రహారం గ్రామంలో వైసిపి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇందులో ఒకతను గాయపడ్డాడు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
గుంటూరు జిల్లా రామిరెడ్డిపాలెంలో తాము ఎత్తుకెళ్లిన పోలింగ్ ఏజెంట్లను తిరిగి వైసిపి కార్యకర్తలు తీసుకొచ్చారు. దీంతో పోలింగ్ ప్రారంభమైంది.
తమ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తున్నారని టిడిపి జమ్మలమడుగు శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి రామసూబ్బారెడ్డి ఆరోపించారు జమ్మలమడుగులో వైసిపి అరాచకం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. వైసిపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన అన్నారు.
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నడవలూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారిని పోలింగ్ ఏజెంట్ను కొట్టారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలింగ్ ఆగిపోయింది.
గిరిజన భవన్లో ఓటు వేయడానికి టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు బైక్పై వచ్చారు.
ప్రకాశం జిల్లా స్వర్ణలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జీ చేశారు.
గుంటూరు జిల్లా కొల్లూరులో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువురు గాయపడ్డారు.
ఉదయం 9 గంటల వరకు 15 శాతం పోలింగ్ జరిగినట్లు సిఈసి భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన చెప్పారు. ఇవియంలు పనిచేయని చోటు కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఒకటి, రెండు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలిపారు
గుంటూరు జిల్లా రామిరెడ్డిపాలెంలో టిడిపి పోలింగ్ ఏజెంట్ను కిడ్నాప్ చేశారు. దాన్ని ఆపేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి పళ్లంరాజు ఓటేశారు. విభజన వ్యతిరేకతను తాను అధిగమిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన అన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు టిడిపి అభ్యర్థి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్కు పోలీసులు వెంకటాపురంలో గృహనిర్బంధం విధించారు. ముందు జాగ్రత్త చర్యగానే ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని వెదరూరులో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కారుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కారు ధ్వంసమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జె. కొత్తపల్లిలోని సుధాకర్ యాదవ్ ఇంటిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన కుటుంబ సభ్యులు గాయపడినట్లు తెలుస్తోంది.
అలాగే, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గొరిగనూరులో టిడిపి అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ఇద్దరు టిడిపి ఏజెంట్లను అపహరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో రామసుబ్బారెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
శ్రీకాకుళం బాలికల పాఠశాల పొలింగ్ కేంద్రం వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి వైయసిపికి ఓటేయాలని చెబుతుండడంతో ఘర్షణ ప్రారంభమైంది.
కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్ల మూడిలో దేనికి ఓటేసినా ఫ్యాన్ గుర్తుకే పడుతున్నట్లు ఓటర్లు, అధికారులు గుర్తించారు. దీంతో పోలింగ్ ఆగిపోయింది. ఇవియంను మార్చాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
చిత్తూరు జిల్లా రంగంపేట పోలింగ్ కేంద్రం వద్ద సినీ నటుడు మోహన్బాబు కాసేపు హల్చల్ చేశారు. క్యూలో నిలబడినట్లే నిలబడ్డారు. క్యూలో నిలబడనివారిని కర్రతో కొట్టండని హితవు చెప్పారు. ఎవరికి ఓటేశావో చెప్పవద్దని, అయితే మంచివారికి ఓటేయాలని ఆయన ఓ మహిళతో అన్నారు. ఆ తర్వాత పోలింగ్ బూత్లోకి ప్రవేశించారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు ఉన్నారు.
మోహన్ బాబు తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. స్వార్థం ఎక్కువై పోయిందని మోహన్ అన్నారు. నీచాతినీచంగా వాగ్దానాలు చేశారని ఆయన అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చానని, తన పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పించానని ఆయన అన్నారు. క్రమశిక్షణతో వచ్చి ఆత్మవంచన లేకుండా రాష్ట్రం ఎవరి వల్ల బాగుపడుతుందో ఆలోచించి ఓటేయాలని ఆయన అన్నారు. ఆత్మాహుతి చేసుకున్న కుటుంబాలకు ఏం చేయాలనే విషయంపై ఆలోచించి రెండు రాష్ట్రాల్లోని కొత్త ముఖ్యమంత్రులు ఆలోచించాలని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పులివెందుల అసెంబ్లీ సీటు అభ్యర్థి వైయస్ జగన్ బుధవారం ఉదయమే ఓటేశారు. ఆయన పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) మొరాయించాయి. గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ నియోజకవర్గంలో పలు చోట్ల ఇవియెంలు పనిచేయలేదు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం క్రిష్ణపల్లి ఇవియం మొరాయించింది.
అనంతపురం జిల్లాలో ముందు జాగ్రత్త చర్యగా 70 మందిని అరెస్టు చేశారు.
కడప జిల్లాలోని ఓ గ్రామంలో టిడిపి అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై స్థానికులు దాడి చేశారు.