కోమటిరెడ్డి, తెరాస అభ్యర్థిలపై వివాదం, నర్సంపేట రగడ
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై తెరాస, స్వతంత్ర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం జరుగుతున్న నామినేషన్ పరిశీలన కార్యక్రమంలో భాగంగా నామినేషన్ పత్రాల్లో కోమటిరెడ్డి తప్పుడు విద్యార్హతను పొందుపర్చారంటూ వారు ఆరోపించారు.
దీనికి సంబంధించిన ఆధారాలను రిటర్రింగ్ అధికారికి అందించిన నేతలు కోమటిరెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి హైదరాబాద్లోని సిబిఐటిలో బిటెక్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే కోమటిరెడ్డి బిటెక్ పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశారని దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెరాస, స్వతంత్ర అభ్యర్థులు తెలిపారు.
తెరాస లోకసభ అభ్యర్థి నామినేషన్ పైన అభ్యంతరం
వరంగల్ జిల్లా మహబూబాబాద్ లోకసభ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ నామినేషన్ పైన రిటర్నింగ్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీతారాం నాయక్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ దాఖలు చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. అయితే, వర్సిటీ అధికారులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అభ్యర్థి చెబుతున్నారు. మరోవైపు ఖానాపూర్ తెరాస అభ్యర్థి రేఖా శ్యాం నాయక్ ఎస్టీ కాదంటూ ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెసులో నర్సంపేట రగడ
కాంగ్రెసు పార్టీలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంపై ఆసక్తికరమైన రగడ సాగుతోంది. టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కత్తి వెంకట స్వామికి బిఫారం ఇచ్చారు. ప్రత్యామ్నాయ అభ్యర్థిగా దొంతి మాధవ రెడ్డి పేరును రాశారు. అయితే, వెంకట స్వామి... దొంతి పేరును కొట్టివేసి నామినేషన్ దాఖలు చేశారట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దొంతి మాధవ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. వెంకటస్వామి నామినేషన్ తిరస్కరిస్తే కాంగ్రెసు పార్టీ పోటీకి దూరమవుతుంది.