గాల్లో ప్రయాణాలు, గాలికి సమస్యలు : చంద్రబాబు ఎక్కడికెళ్లుంటారు..?
ఓవైపు దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే.. చంద్రబాబుకు మాత్రం ఇదేం పట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానితో భేటీ అవడం, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఇతర సమస్యలపై ప్రధానికి వివరించడం, 1000 కోట్ల ఆర్థిక సహాయం కోరడం జరిగిపోయాయి.
ఇక ఏపీలోని కొన్ని ప్రాంతాలు కరువుతో విలవిలలాడుతూ.. తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, సమస్యలను గాలికొదిలేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పరిస్థితులను పర్యవేక్షించాల్సిన సీఎం చంద్రబాబే వ్యక్తిగత టూర్లపై ఫోకస్ చేస్తుంటే ఇక అధికారులు మాత్రం ఏం చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరింత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే.. అసలు చంద్రబాబు ఇప్పుడు ఎక్కడికెళ్లారనే దానిపై టీడీపీ శ్రేణులకు కూడా సమాచారం లేకపోవడం. ఆదివారం రాత్రి సతీసమేతంగా విదేశాలకు పయనమయ్యారు సీఎం చంద్రబాబు. అయితే పార్టీ నేతల్లో ఒక నేత తెలియపరిచిన వివరాల ప్రకారం.. తొలుత థాయ్ లాండ్ కు వెళ్లనున్న చంద్రబాబు కుటుంబం, ఆ తర్వాత స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లనుందని తెలుస్తోంది.
కాగా.. సీఎం చంద్రబాబు నాయుడు కంటే రెండు రోజులు ముందుగానే విదేశాలకు పయనమయ్యారు ఆయన తనయుడు నారా లోకేష్. వ్యాపార వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఇద్దరు విదేశీ టూర్లకు వెళ్లారన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సీఎం ముందస్తు షెడ్యూల్ ప్రకారం 15 వ తేదీన చంద్రబాబు విజయవాడకు చేరుకుంటారని సమాచారం. అయితే పనామా పేపర్స్ లో సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ డైరెక్టర్ శివరామ్ ప్రసాద్ పేరు బయటపడిన వెంటనే చంద్రబాబు విదేశీ ప్రయాణాలు చేయడం, ఎక్కడికెళ్తున్నారనే దానిపై పార్టీ నేతలకు కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో.. చంద్రబాబు టూర్లపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.