హైడ్రామా: జగన్ పట్ల పోలీసుల దురుసు, సారీ చెప్పిన సీపీ, బలవంతంగా హైదరాబాద్
జల్లికట్టు స్ఫూర్తిగా ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిరసన తెలుపుదామనుకున్న వైసిపి అధినేత వైయస్ జగన్కు చుక్కెదురయింది.
విజయవాడ: జల్లికట్టు స్ఫూర్తిగా ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిరసన తెలుపుదామనుకున్న వైసిపి అధినేత వైయస్ జగన్కు చుక్కెదురయింది. పోలీసులు జగన్ను విశాఖ ఎయిర్ పోర్టులోనే అడ్డుకొని, తిరిగి హైదరాబాద్ పంపించారు.
అంతకుముందు, జగన్ హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయంలోనే పోలీసులు జగన్, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డిలను నిర్బంధించారు. దీంతో రెండు గంటలకు పైగా హైడ్రామా చోటు చేసుకుంది.
జగన్ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విశాఖ నగర పోలీస్ కమిషనర్ యోగానంద్.. జగన్తో చర్చలు జరిపారు. పోలీసులు తన పట్ల అనుచితంగా, దురుసుగా ప్రవర్తించారని జగన్ ఆగ్రహించారు.
కిందిస్థాయి పోలీసులు జగన్ పట్ల వ్యవహరించిన తీరుకు సిపి యోగానంద్ చింతిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చర్చలు జరిపి... బలవంతంగా జగన్ బృందాన్ని హైదరాబాద్ విమానం ఎక్కించారు. విశాఖ నుంచి జగన్ బృందం ఆరు గంటల ప్రాంతంలో తిరుగు పయనమయింది. ఆర్కే బీచ్ వద్ద క్యాండిల్ లైట్ నిరసనకు హాజరు కాకుండానే హైదరాబాద్ వస్తున్నారు.
సీఎంనే ఆపుతావా.. ఇక నేనే, గుర్తు పెట్టుకొని తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్
మరోవైపు, జగన్కు అనుకూలంగా విమానాశ్రయం బయట వైసిపి మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా, అంతకుముందు అంబటి రాంబాబు భద్రతా సిబ్బందిని నెట్టివేసినట్లుగా తెలుస్తోంది. విజయ సాయి రెడ్డి వంటి నేతలు కొడతానని హెచ్చరించారని కూడా సమాచారం.
జగన్ అసహనానికి లోనయ్యారు
ఉదయం నుంచి పరిస్థితి ప్రశాంతంగా ఉందని సీపీ యోగానంద్ చెప్పారు. 500 మంది పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మా సిబ్బంది పరిస్థితిని వివరించడంలో ఎదురైన ఇబ్బందులతో జగన్ అసహనానికి గురయ్యారన్నారు. 143 సెక్షన్ నోటీసు ఇచ్చినందు వల్ల తిరిగి వెళ్లేందుకు అంగీకరించారన్నారు.
ఉదయం నుంచీ..
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ వేదికగా యువత నిరసన చేపడతామని చెప్పిన నేపథ్యంలో బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్డులోని వైఎంసీఏ కేంద్రంగా నిరసన, మౌన దీక్ష చేపడతామని యువత ముందుగా ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసులు అప్రమత్తం
అటు ఆర్కే బీచ్, ఇటు పార్క్ హోటల్ మార్గాల్లో పోలీసులు ఎవరినీ అనుమతించడంలేదు. బీచ్ రోడ్డంతా పోలీసులతో నిండిపోయింది. నగరమంతా 144 సెక్షన్ విధించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా యువత పేరుతో విశాఖ బీచ్లో మౌనదీక్షకు పిలుపునివ్వడం, దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సంస్థలు మద్దతు ప్రకటించాయి.
జగన్ హాజరవుదామనుకున్నా..
ఆర్కే బీచ్లో వైసిపి కొవ్వొత్తు ప్రదర్శనకు జగన్ హాజరవుదామనుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనను పోలీసులు బలవంతంగా విశాఖ విమానాశ్రయంలోనే హైదరాబాద్ పంపించారు. ఈ సమయంలో రెండున్నర గంటల పాటు విమానాశ్రయంలో హైడ్రామా నడిచింది.
జగన్ పైన టిడిపి ఆగ్రహం
ఆర్కే బీచ్ నిరసన నేపథ్యంలో జగన్ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయాలని చూస్తున్నారని టిడిపి మండిపడింది. హోదా దీక్ష పేరుతో విశాఖలో విధ్వంసానికి పాల్పడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బహిరంక చర్చకు టిడిపి సవాల్
ప్రత్యేక హోదా... ప్రత్యేక ప్యాకేజీపై బహిరంగ చర్చకు సిద్ధమి, ప్రభుత్వ ప్రతినిధిగా తాను వస్తానని, జగన్ చర్చకు సిద్ధమా? అని, వైఎస్ హయాంలో పరిశ్రమల కోసం సదస్సులు పెట్టిన దాఖలాలున్నాయా? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం ఉందా
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వైయస్ జగన్ అంతకుముందు మండిపడ్డారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు.
సుజన ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా అయిపోయిన అంశమని, దాని గురించి ఇప్పుడు చర్చ అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ కళ్యాన్ నిప్పులు చెరిగారు.
శివాజీ ఆగ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు శివాజీ ఐదు ప్రశ్నలు సంధించారు. మొత్తానికి ఆర్కే బీచ్ వద్ద నిరసన కార్యక్రమాలను పోలీసులు సఫలం కానివ్వలేదు.