డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లు
హైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి దాదాపు ఐదేళ్లుగా దూరవిద్య విధానంలో బీఈడీ కోర్సు కొనసాగించడం లేదు. నిబంధనలకు విరుద్ధమంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అభ్యంతరం చెప్పడంతో అప్పటినుంచి బీఈడీ కోర్సును అందించడం లేదు. అయితే ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ డైరెక్టర్ చింతా గణేశ్ చొరవతో మళ్లీ బీఈడీ కోర్సును దూరవిద్య విధానంలో అందించేందుకు మార్గం సుగమమైంది.
దూరవిద్యలో బీఈడీ
2018-19 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీఈడీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఓయూ. 500 సీట్లకు గాను ఉమ్మడి జిల్లాల పరిధిలోని 10 స్టడీ సెంటర్లలో ఒక్కో కేంద్రానికి 50 చొప్పున సీట్లు కేటాయించింది. అడ్మిషన్ల కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఓయూ దూరవిద్యకు సంబంధించిన www.oucde.net వెబ్సైట్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 15వ తేదీని గడువుగా నిర్ణయించారు అధికారులు. 200 రూపాయల లేట్ ఫీజుతో మరో 5 రోజులు దరఖాస్తు చేసుకునే వీలుంది (ఫిబ్రవరి 20). NCTE నిబంధనల మేరకు స్టడీ సెంటర్లలో రోస్టర్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరగనుంది. మెథడాలజీ ప్రకారం కోటా అమలవుతుంది.
10% రగడ : ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు, ఢిల్లీలో ధర్నాకు బీసీలు రె'ఢీ'..!
ఎవరు అర్హులంటే..!
వాస్తవానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. కానీ ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించిన తాజా నోటిఫికేషన్ మాత్రం తెలంగాణకు చెందినవారికి మాత్రమే వర్తించనుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, టీటీసీ గానీ డీ.ఈడీ గానీ పూర్తిచేసి ఉండాలి. అంతేకాదు డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు రిజర్వ్డ్ కేటగిరీలకు చెందినవారికి మాత్రం 40 శాతం పాస్ మార్కులుంటే చాలు.
ఓకే చెప్పిన NCTE
ఉస్మానియా యూనివర్సిటీలో 2014 ముందు వరకు డిస్టెన్స్ మోడ్ లో బీఈడీ కోర్సు అందించింది కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే అది నిబంధనలకు విరుద్ధమంటూ 2014లో NCTE అభ్యంతరం వ్యక్తం చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోనే దూరవిద్య కోర్సులు అందించాలని స్పష్టం చేసింది. ఇక అప్పటినుంచి దూరవిద్యలో బీఈడీ అందకుండా పోయింది. అయితే ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చింతా గణేశ్ దీనికోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. NCTE అధికారులతో పలుమార్లు మాట్లాడి వారిని ఓయూకు రప్పించారు. ఇక్కడి పరిస్థితులు వివరించి బీఈడీ దూరవిద్య అందించేలా ఒప్పించారు. మొత్తానికి ఆయన కృషి ఫలితంగా 2018-19 లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బీఈడీ కోర్సు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్లైంది.