హైదరాబాద్ అభివృద్ది మరిచారు.. ఏడేళ్లలో ఏం చేశారు: షర్మిల
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో అద్భుతం చేసి చూపించారని ఆమె గుర్తుచేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి చేర్చారని గుర్తుచేశారు. తర్వాత హెచ్ఎండీఏ ఏర్పాటు చేసి, నగర అభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు రోడ్లను వెడల్పు చేశారని.. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారని వివరించారు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే నిర్మించారని.. సాంకేతికతకు పెద్దపీట వేసి విద్య, వైద్య, ఐటీ రంగాల్లో మహానగరాన్ని ముందు నిలిపారని తెలిపారు. ఇవాళ ఆమె గ్రేటర్ నాయకులతో సమావేశం అయ్యారు. సిటీ డెవలప్ మెంట్ గురించి మాట్లాడారు.
మెట్రో రైలు
శంషాబాద్ ఎయిర్ పోర్టు కూడా 5 ఏళ్లలోనే నిర్మించారని వివరించారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చారని చెప్పారు. గ్రేటర్లో 1.4 లక్షల మందికి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారని.. హైదరాబాద్ కు మెట్రో రైల్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా నగర ప్రజలకు ఉచిత వైద్యం అందించారని.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకున్నారని ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఎటుచూసినా గతుకుల రోడ్లు, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్, పచ్చదనం కరువై భాగ్యనగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీఎస్ఈపాస్ లో దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా అనుమతులు రావడం లేదని.. ప్రతి పేద ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేశారని విరుచుకుపడ్డారు.
భద్రత లేదు
నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని. వీధుల్లో ఎటుచూసినా అంధకారమే. మంచినీళ్లు అందని కాలనీలు ఎన్నో ఉన్నాయని షర్మిల గుర్తుచేశారు. ఏడేండ్లలో కేబుల్ బ్రిడ్జి, రెండుమూడు ఫ్లైఓవర్లు తప్ప నగరానికి చేసిందేమీ లేదన్నారు. వరదలు వస్తే భాగ్యనగరం మునిగిపోయినా.. పాలకులకు పట్టింపు ఉండదన్నారు. ఆనాడు కుతుబ్ షా నగరాన్ని సరస్సులో చేపల వలే నింపేయాలని చక్కటి సందేశం ఇస్తే.. ఇవాళ కేసీఆర్ నిజంగానే ప్రజలను నీళ్లలో ముంచుతున్నారు. పడవల్లో తిరగడం తప్పించి ఏ సాయమూ చేయరు. బస్తీ దవాఖానాలు నామమాత్రంగా ఏర్పాటు చేసి, చేతులు దులుపుకొన్నారు. ఖాళీ జాగాల కబ్జాలు.. ఖాళీ చెరువుల ఆక్రమణలు.. టీఆర్ఎస్ లీడర్లు తోడేళ్లలా భూములు తినేస్తున్నారని ఫైరయ్యారు.
వారిని కూడా మోసం చేశారు...
సెలూన్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తానని చెప్పి, నాయీబ్రాహ్మణులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అని చెప్పి రజకులను మోసం చేశారు. జంటనగరాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసమైన దోబీఘాట్లను పునరుద్దరించలేదన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి పారుదల వ్యవస్థను విస్తరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక మాటలకే పరిమితం అయిందని.. ప్రధాని మోడీ మూడు నదులను అనుసంధానం చేస్తామని చెబితే అవహేళన చేసిన కేసీఆర్.. ఎన్నికల సమయంలో గోదావరితో మూసీ అనుసంధానం అని మాయమాటలు చెప్పారు. ట్యాంక్ బండ్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తామని ప్రగల్భాలు పలికి.. అదే ట్యాంక్ బండ్ పై 10 నిమిషాలు నిల్చోలేని స్థాయికి తెచ్చారు.
రెండో దశ మెట్రో
బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు నది మధ్యలో బోటింగ్ అన్నారు.. నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రెండో దశ మెట్రో రైలు రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు, బీహెచ్ఎల్ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరిస్తామన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడం పక్కన పెడితే మెట్రోను నష్టాల్లోకి చేర్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ రూపురేఖలు మారుస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కాదు కదా.. ఉన్న బస్ డిపోలను అమ్మే పనిలో కేసీఆర్ ఉన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఉన్న కార్డులు పీకేశారు. సీనియర్ సిటిజన్ల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీల ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా లేదన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వాలని రాజీవ్ స్వగృహ ద్వారా వేలాది ఇండ్లు నిర్మిస్తే.. నేడు కేసీఆర్.. వాటిని అమ్మే పనిలో పడ్డారని విమర్శించారు. 10 వేల చొప్పున ఆరేండ్లకు గాను 60 వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. ప్రతి డివిజన్కు 400 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. కానీ 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పాలనను ప్రజలకు వివరించాలి. స్థానిక సమస్యలు తెలుసుకొని ధర్నాలు, దీక్షలు, నిరసనలు తెలియజేయాలని.. స్థానికంగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారి సమస్యలు పరిష్కరించి పార్టీ తరఫున అండగా నిలబడాలని కోరారు.
Recommended Video
హామీల అమలు ఏదీ
టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులకు అందేలా చేయాలి. వృద్ధాప్య పించన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందరికీ అందేలా చూడాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఆదాయం పెరిగినా వాటిని సిటీ డెవలప్ మెంట్ కు ఖర్చు చేయకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో కాలనీలు మునిగి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పడవల్లో ప్రయాణించి, ఆహార పదార్థాలు ఇవ్వడం తప్ప వరద నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తామని ఇందుకోసం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రగల్బాలు పలకడం తప్ప ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. నగరంలో చెరువులు, కుంటలు, పార్కు స్థలాలు అడుగడుగునా అధికార పార్టీ లీడర్ల చేతిలో కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు.