రైతుల చావుల్లో కూడా తేడాలా..? మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆగాయా..?: షర్మిల
రాష్ట్రంలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతుల చావుల్లో కూడా తేడాలు చూస్తున్నారని తెలిపారు. వానాకాలం వడ్లు కొనుగోలులో జాప్యం, యాసంగి వరి పండించవద్దని కేసీఆర్ చెప్పడంతో రైతులు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. 7 ఏండ్లలో 7వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. గత 70 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని చెప్పారు.
వరి తప్ప..
యాసంగికి వరి తప్ప తమ భూముల్లో వేరే పంటలు పండే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నా, కేసీఆర్ మాత్రం తనకేమీ సంబంధం లేదనట్టు వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం అందించడంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతు భీమా పేరుతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తున్న డబ్బులు కూడా వారికి సరిగా అందడం లేదన్నారు. దాదాపు 7600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే 1600 మందికి మాత్రమే పరిహారం ఇస్తే సరిపోతుందా..? మిగతా 6000 మంది రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటి..? రైతుల చావుల్లో కూడా తేడాలా..? రైతు భీమా డబ్బుల కోసం రైతు కుటుంబాలు ఏండ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
వారికి మాత్రం పక్కాగా జీతాలు
సీఎంకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు సరైన సమయానికి ఇవ్వడం తెలిసిన కేసీఆర్.. రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పంట కొనుగోలు జాప్యంతో.. యాసంగి వరి కొనుగోలు చేయబోమని కేసీఆర్ చెప్పడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం. రైతులవి ఆత్మహత్యలు కావు..కేసీఆర్ చేసిన హత్యలే... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఉసురు కేసీఆర్కు తగులుతుందన్నారు.
ఇదీ కూడా రాజకీయం
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తోందని షర్మిల విమర్శించారు. రాష్ట్ర రైతాంగం ఒక్కటై టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఇకనైనా పాలకులు మారాలని.. రైతుల గోసను అర్థం చేసుకోవాలని కోరారు.