కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు.. రీజన్ ఇదే
సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీసీల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, వీసీల నియామకంపై విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం చేపట్టిన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ, తెలుగు యూనివర్సిటీలో ఉప కులపతుల నియామకం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. కాకతీయ యూనివర్సిటీ వీసీకి కనీసం పదేళ్ల అనుభవం కూడా లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇక తెలుగు యూనివర్సిటీ వీసీగా ఉన్న కిషన్ రావుకు 70 సంవత్సరాలు దాటాయని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
Recommended Video
పిటిషనర్ తరఫు వాదనలు విన్న న్యాయస్థానం కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్, తెలుగు యూనివర్సిటీ వీసీ కిషన్ రావు లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తమ వాదన తెలియజేయాలని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారికి విశ్వవిద్యాలయ ఉప కులపతి పోస్టులను ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వానికి, యుజిసి కి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 27 కు వాయిదా వేసింది తెలంగాణా హైకోర్టు.