ఇంటర్ ఫస్టియర్ అంతా పాస్.. 51 శాతం మందిపై సబితా ప్రకటన
ఇంటర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫెయిల్ అయిన వారంతా పాస్ అయ్యారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 51 శాతం మంది ఫెయిలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిని మినిమం మార్కులతో పాస్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఫెయిల్ అయ్యాయని విద్యార్థులు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేవలం 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ కావడంతో ఆందోళనలు పీక్కి చేరాయి.
అంతకుముందు ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్కు చెందిన ధనుష్ తమ ప్రాణాలను తీసుకున్నారు. నల్గొండకు చెందిన జాహ్నవి ఇంటర్లో ఒక సబ్జెక్ట్ తప్పింది. తనకిక జీవితమే లేదనుకుంది. అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఫలితాలు విడుదలయ్యాక తాను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టు తెలుసుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెప్పింది. తల్లిదండ్రులతో ఏం జరిగింది? ఎందుకు ఫెయిల్ అయ్యావు? అంటూ జాహ్నవిని ప్రశ్నించారు. దీంతో ఏం సమాధానం చెప్పలేకపోయింది. తనలో తానే కుమిలిపోయింది. బాగానే చదివే తను ఎందుకు ఫెయిల్ అయ్యాననే ప్రశ్న వెంటాడిందో ఏమో అందరూ పడుకున్నాక రైల్వే ట్రాక్పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. జాహ్నవి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.
నిజామాబాద్కు చెందిన ధనుష్ కూడా ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ధనుష్ మృతితో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. మిగతావారు కుమిలిపోయారు. చాలా మంది ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫెయిల్ అయిన వారిని పాస్ చేసింది. మినిమం మార్కులతో గట్టెక్కించింది.