ఎస్సై రాత పరీక్ష తేదీ మార్చండి, ప్రభుత్వాన్ని కోరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. పోలీసు శాఖలో ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 7వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ తేదీని మార్చాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఎందుకో కారణం కూడా వివరించారు.
ఎస్సై పోస్టుల రాత పరీక్ష తేదీని మార్చాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. ఆగస్టు 7వ తేదీన సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షతోపాటు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలకు తెలంగాణకు చెందిన నిరుద్యోగులు హాజరవుతున్నారని వివరించారు. ఎస్సై పోస్టుల రాత పరీక్షను మరో తేదీకి మార్చాలని ఆయన కోరారు.
నిజానికి ప్రవీణ్ కుమార్ కోరిన అంశం న్యాయమైనదే.. కానీ దీనిపై రిక్రూట్ మెంట్ బోర్డు స్పందించాలి.. ప్రభుత్వం ఆదేశాలతో తేదీని వాయిదా వేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకు ఇతర ఉద్యోగ అవకాశాలు కోల్పోయనీయకుండా చేయకుండా ఉండాలంటే విధిగా తేదీని మార్చాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నియామకాల కోసం.. ఇదీ కీలకమైన డిమాండ్. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు పోస్టులు ఫిలప్ అయిన.. ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో నిరుద్యోగ యువత గుర్రుమీదుంది. అందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కొలువుల జాతరను ప్రకటించారు. ఆ మేరకు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.