మోడీవి అనాలోచిత నిర్ణయాలు.. అగ్నిపథ్ అలాంటిదే: రేవంత్ రెడ్డి ఫైర్
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. పథకం వద్దని నిరసనలు హోరెత్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మోడీపై, బీజేపీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ చదువు లేని వ్యక్తి అని, అందుకే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారని కామెంట్ చేశారు.
బీజేపీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నమేమీ కాదని రేవంత్ అన్నారు. సైనిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మోడీకి తెలియదన్నారు. ఇతర దేశాలు దాడులు చేస్తే ప్రతిదాడులకు సైన్యాన్ని వినియోగిస్తారని, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైనికులు రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అగ్నిపథ్ కింద నాలుగేళ్ల పాటు ఆయుధాల వాడడంపై శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటికి పంపిస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు.
అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశంలో అయోమయం సృష్టించి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఇజ్రాయిల్ చిన్న దేశం, దానితో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. అమెరికాలో ఆర్మీ నుంచి బయటకు రాగానే అవకాశాలు ఉన్నాయని.. భారత్లో పరిస్థితి భిన్నమని రేవంత్ అన్నారు. నిరుద్యోగ తీవ్రత ఎక్కువ ఉందని, అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం కీలక అంశాలను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వివరించారు. నోట్ల రద్దు కూడా పెద్ద అనాలోచిత నిర్ణయం అనేవారు ఉన్నారు. దాదాపు 150కి పైగా ప్రజలు ఏటీఏం సెంటర్లలో నిలబడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటారు. ఆయా అంశాలను నేతలు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు రేవంత్ అగ్నిపథ్ పథకంపై ఫైర్ అయ్యారు. యువత గురించి ఆయన ఏమాత్రం ఆలోచించలేదని విరుచుకుపడ్డారు.