రికార్డ్ బ్రేక్.. ఈసారి లోక్సభలో ఎంత మంది మహిళలు అడుగుపెట్టనున్నారో తెలుసా?
ఢిల్లీ : 17వ లోక్సభలో మహిళలు రికార్డు సృష్టించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత మంది మహిళలు ఈసారి సభలో అడుగు పెట్టనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 724మంది మహిళలు పోటీ చేయగా... వారిలో 78 మంది విజయం సాధించారు. తొలి లోక్సభ నుంచి గమనిస్తే చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న విషయం అర్థమవుతుంది.
పంజాబ్లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్కు సీఎం కంప్లైంట్...
మళ్లీ ఎన్నికైన 27మంది సిట్టింగ్లు
కొత్తగా ఎన్నికైన వారితో కలిపి లోక్సభలో మహిళ ఎంపీల శాతం 14కు చేరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి గెలిచిన 78మంది మహిళల్లో 27 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. యూపీఏ ఛైరపర్సన్ సోనియా గాంధీ, బీజేపీ నుంచి పోటీ చేసిన హేమమాలిని, కిరణ్ ఖేర్, రీటా బహుగుణ, డీఎంకే నేత కనిమొళి, బెంగాల్కు చెందిన లాకెట్ చటర్జీ తదితరులు తమ స్థానాలను కాపాడుకున్నారు.
క్రమంగా పెరుగుతున్న ప్రాతినిధ్యం
కొత్త మహిళా ఎంపీల్లో ఉత్తర్ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల నుంచి 11 మంది చొప్పున ఎన్నికయ్యారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో మహిళలు లోక్సభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి ప్రతి సార్వత్రిక ఎన్నిక సమయంలో లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. మొదటి, రెండో లోక్సభలో 24 మంది చొప్పున మహిళలు ఎన్నిక కాగా.. మూడో లోక్సభలో 37మంది అడుగుపెట్టారు. ఎనిమిదో లోక్సభ 45, తొమ్మిదిలో 28, 10వ లోక్సభలో 42 మంది మహిళలు చట్టసభకు ఎన్నికయ్యారు. 11వ లోక్సభలో 41, 12లో 44, 13లో 52, 14వ లోక్సభలో 52 మంది మహిళలు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 15వ లోక్సభలో 52, 16వ లోక్సభలో 64 మంది మహిళా ఎంపీలు తమ వాణి వినిపించారు.
టికెట్లు కేటాయింపులో కాంగ్రెస్ టాప్
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 54 మంది బరిలో నిలవగా.. బీజేపీ 53 మందికి టికెట్లు ఇచ్చింది. బీఎస్పీ 24, తృణమూల్ కాంగ్రెస్ 23, సీపీఎం 10, సీపీఐ 4, ఎన్సీపీ నుంచి ఒక మహిళ పోటీ చేశారు. 222 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. యూపీలో అత్యధికంగా 104 మంది, తమిళనాడులో 64, బీహార్లో 55, బెంగాల్లో 54మంది మహిళలు పోటీ చేశారు.