మథురలో ఎదురు కాల్పులకు 8 ఏళ్ల బాలుడి బలి
మథుర: పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులకు ఎనిమిదేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో గత రాత్రి పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బాలుడు మరణించాడు.
ఎదురుకాల్పుల్లో ఓ బుల్లెట్ మాధవ్ భరద్వాజ్ తలలోకి దూసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఓ దోపిడీ కేసులోని నిందితులు లక్నోకు 450 కిలోమీటర్ల దూరంలో గల మోహన్పుర గ్రామంలో దాక్కున్నారనే సమాచారం అందిందని, దాంతో తాము దాడి చేసిన సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
బాలుడికి తగిలిన బుల్లెట్ పోలీసుల ఆయుధం నుంచి వెలువడిందా, నేరస్థుల ఆయుధం నుంచి వెలువడిందా అనేది తెలియయదని అంటున్నారు. నేరస్థులను లోంగిపోవాల్సిందిగా పోలీసులు కోరుతున్న సమయయంలో వారు కాల్పులు ప్రారంభించారని, దానివల్ల ఎదురు కాల్పులు జరిగాయని అంటున్నారు.
బాలుడి కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కేసు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇస్తూ బాలుడి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించింది.
యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 900 ఎన్కౌంటర్లలో దాదాపు 32 మంది మరణించారు. రాష్ట్రంలోని నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరంచాల్సిన అవసరాన్ని యోగి ఆదిత్యానాథ్, పోలీసు ఉన్నతాధికారులు నొక్కి చెబుతూ వచ్చారు.