దారికొచ్చిన గూగుల్, ఫేస్ బుక్, ఇన్ స్టా- కొత్త రూల్స్ తర్వాత తొలి రిపోర్ట్- ట్విట్టర్ లో తెలిపిన కేంద్రం
దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే 26 నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం 50 లక్షల యూజర్లు దాటిన సోషల్ మీడియా సంస్ధలు తమ ప్లాట్ ఫామ్స్ పై ఉన్న కంటెంట్ పారదర్శకత పాటించడంతో పాటు దాని అమలుపై నెలవారీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సమర్పించేందుకు మిగతా సంస్ధలు అంగీకరించినా ట్విట్టర్ మాత్రం కేంద్రంతో పోరాటం కొనసాగిస్తోంది.
దేశవ్యాప్తంగా కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఫేస్ బుక్, గూగుల్, ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్ధలు తొలిసారిగా నిబంధనల అమలుపై తమ నివేదికలను విడుదల చేశాయి. ఈ మూడు సంస్ధలు కొత్త ఐటీ రూల్స్ కు అనుగుణంగా తమ నివేదికలు వెల్లడించడంపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ ట్విట్టర్ లో స్పందించారు. ఇప్పటివరకూ ఐటీ నిబంధనలు అమలు చేయని ట్విట్టర్ లో కేంద్రమంత్రి ఈ విషయం పంచుకోవడం విశేషం. కొత్త ఐటీ రూల్స్ కు అనుగుణంగా లేని పోస్టుల్ని స్వచ్చంధంగా తొలగించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పారదర్శకత దిశగా పడిన తొలి అడుగుగా దీన్ని అభివర్ణించారు.
తాజా ఐటీ రూల్స్ ప్రకారం మే 15 నుంచి జూన్ 15 మధ్య తాము 10 కేటగిరీల్లో 30 మిలియన్ల కంటెంట్ పీసుల్ని తొలగించినట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. ఇందులో 25 మిలియన్ల కంటెంట్ కు సంబంధించిన సమాచారాన్ని, 2.5 మిలియన్ల గ్రాఫిక్ కంటెంట్ ను, 1.8 మిలియన్ల సెక్స్ సంబంధిత సమాచారాన్ని, 3.11 లక్షల విద్వేష వ్యాఖ్యల్ని తొలగించింది. అలాగే ఇన్ స్టా గ్రామ్ 9 కేటగిరీలకు చెందిన 2 మిలియన్ల కంటెంట్ పీసుల్ని తొలగించింది. మరో దిగ్గజం గూగుల్ 59 వేలకు పైగా కంటెంట్ పీసుల్ని తొలగించినట్లు వెల్లడించింది.
Nice to see significant social media platforms like Google, Facebook and Instagram following the new IT Rules. First compliance report on voluntary removal of offensive posts published by them as per IT Rules is a big step towards transparency. pic.twitter.com/FhzUv4pHUp
— Ravi Shankar Prasad (@rsprasad) July 3, 2021