బిజెపి ఔట్: టెన్త్ బోర్డ్ పరీక్షలో జవాబు 'లేని' ప్రశ్న!
శ్రీనగర్: ‘జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ ప్రభుత్వంతో పొత్తులో ఉన్న పార్టీ ఏదీ?' అని ప్రశ్నిస్తే.. తెలిసినవారు ఎవరైనా సమాధానం భారతీయ జనతా పార్టీ అనే చెబుతారు. అదే ప్రశ్నకి నాలుగు సమాధానాలు ఇచ్చి.. అందులో సరైనది ఎంచుకోవాలని చెప్పి.. ఆ సమాధానాల్లో బిజెపి లేకపోతే ఏం చేస్తారు? ఏం చెబుతారు.
ఇలాంటి చిక్కే ఎదురైంది జమ్మూకాశ్మీర్ పదవ తరగతి విద్యార్థులకు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జమ్మూకశ్మీర్లో పదోతరగతి విద్యార్థులకు బోర్డ్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో గత మార్చిలో పీడీపీ ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్న పార్టీ ఏది? అన్న ప్రశ్న వచ్చింది.
కానీ ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాల్లో కాంగ్రెస్, సీపీఐ(ఎం), పిడిఎఫ్ మరో ప్రాంతీయ పార్టీల పేర్లు పొందుపరిచారు.
అసలు పీడీపీతో పొత్తులో ఉన్న బిజెపి మాత్రం ఆప్షన్స్లో కనిపించలేదు. ఈ విషయంపై ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టినట్లు తెలిపారు. కాగా, తప్పుగా వచ్చిన ప్రశ్నకు ఒక మార్క్ కలిసేలా చూడాలని 10వ తరగతి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.