బండి సంజయ్ పాదయాత్ర వాయిదా... కారణమిదే... అగస్టు 24 నుంచి ప్రారంభించాలని నిర్ణయం...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని సంజయ్ భావించారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇదే నెల 24వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
టార్గెట్ 2024... బీజేపీ మాస్టర్ ప్లాన్... రంగంలోకి 43 మంది కేంద్రమంత్రులు-15వేల కి.మీ యాత్ర
హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి 24వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతుందని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన నేపథ్యంలో ఈ నెల 16,17,18 తేదీల్లో జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 16వ తేదీన కోదాడ నుంచి మొదలయ్యే జన ఆశీర్వాద యాత్ర... అక్కడి నుంచి ఖమ్మం,17న మహబూబాబాద్,ములుగు,రామప్ప,వరంగల్ మీదుగా 18న జనగామ,యాదాద్రి భువనగిరిల మీదుగా హైదరాబాద్లో ప్రవేశిస్తుందని తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు యాత్ర జరుగుతుందన్నారు.
కొత్తగా కేంద్రమంత్రులుగా ఎంపికైన వారిని జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ అధిష్ఠానం జనఆశీర్వాద్ యాత్రలను నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న 43 మంది ఈ యాత్రల్లో పాల్గొనున్నారు. తమ తమ రాష్ట్రాల్లో 3,4లోక్సభ నియోజకవర్గాలు,దాదాపు 400కి.మీ కవర్ చేస్తూ ఈ యాత్రలు సాగనున్నాయి. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలు,పార్టీ కార్యకర్తలు,సామాజిక కార్యకర్తలు,స్వామిజీలతో కేంద్రమంత్రులు మమేకం కానున్నారు. అందరి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీ ఇవ్వనున్నారు.
Recommended Video
దేశవ్యాప్తంగా మొత్తం 15వేల కి.మీ మేర ఈ యాత్రలు జరగనున్నాయి. ఒకరకంగా 2024 ఎన్నికల ప్రచారానికి ఈ యాత్రలు ఆరంభమనే వాదన వినిపిస్తోంది. జన ఆశీర్వాద్ యాత్రల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు,అభివృద్దిని కేంద్రమంత్రులు జనంలోకి తీసుకెళ్లనున్నారు. ఘనంగా,జనాకర్షణీయంగా ఈ యాత్రలను ప్లాన్ చేస్తున్నారు.