బెంగాల్ బీజేపీకి షాక్: టీఎంసీలో చేరిన అర్జున్ సింగ్
పశ్చిమ బెంగాల్ అంటేనే టీఎంసీ వర్సెస్ బీజేపీ రాజకీయ ఆధిపత్యం గుర్తుకు వస్తోంది. టీఎంసీ కంచుకోటకు బీటలు వారేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. దానికి టీఎంసీ కూడా ధీటుగానే కౌంటర్ ఇస్తోంది. బీజేపీలో చేరిన నేతలను తమ పార్టీలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎంపీ అర్జున్ సింగ్ బీజేపీని వీడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ అర్జున్ సింగ్ను తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పార్టీలోకి ఆహ్వానించారు.
తన కార్యకలాపాలకు అడ్డుతగులుతోందని బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా అర్జున్ సింగ్ గుర్రుగా ఉన్నారు. జనపనార ధరపై కేంద్రం నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవడం పట్ల అర్జున్ సింగ్ అసంతృప్తికి గురయ్యారు. గతకొన్నాళ్లుగా జనపనారకు మద్దతు ధర కోసం అర్జున్ సింగ్ పోరాడుతున్నారు. కేంద్రం నిర్ణయం ఆయనను నిరాశకు గురిచేసింది.
అర్జున్ సింగ్ బెంగాల్ లోని బారక్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అర్జున్ సింగ్ గతంలో తృణమూల్ పార్టీకి చెందినవారే. 2019లో టీఎంసీ దినేశ్ త్రివేదీకి టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన అర్జున్ సింగ్ బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో అర్జున్ సింగ్... త్రివేదీని ఓడించారు. అర్జున్ సింగ్ తనయుడు పవన్ సింగ్ భాత్ పారా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పవన్ సింగ్ కూడా తండ్రి బాటలోనే టీఎంసీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.