నితీష్ కుమార్ సర్కారు బలపరీక్షకు రెండు వారాలు: బీజేపీ ‘స్పీకర్’ కారణంగానే?
న్యూఢిల్లీ: బీహార్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 24న బీహార్ శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి బలపరీక్షను ఎదుర్కోనుంది. బీహార్ కేబినెట్ విస్తరణ ఆగస్టు 16న జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఎన్డిఎతో పొత్తును తెంచుకున్న ఒక రోజు తర్వాత.. నితీష్ కుమార్ బుధవారం మహాఘట్బంధన్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తేజస్వి యాదవ్తో జరిగిన సమావేశంలో.. నితీష్ కుమార్ ఆగస్టు 24న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని, ఆగస్టు 25న శాసన మండలి సమావేశానికి పిలుపునిచ్చే ప్రతిపాదనను ఆమోదించారు.
ఇంకా, నితీష్ కుమార్ ప్రతిపాదన గురించి గవర్నర్ ఫాగు చౌహాన్కు తెలియజేశారు. ఆయన ఆమోదంపై నిర్ణయం కోసం వేచి ఉంది. గవర్నర్ సమావేశానికి పిలిస్తే ప్రభుత్వ సూచన మేరకు నడుచుకోవాలన్నారు. కాగా, ఆగస్టు 16న రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని వార్తా సంస్థ ఏఎన్ఐ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు బీజేపీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై మహాకూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. మహాకూటమికి చెందిన పలువురు శాసనసభ్యులు సంతకాలతో కూడిన నోటీసును బుధవారం అసెంబ్లీ సెక్రటేరియట్కు సమర్పించారు.
సిన్హా స్పీకర్ గా ఉంటే తమకు బలనిరూపణలో ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో ఆయనను తొలగించాలని జేడీయూ, ఆర్జేడీ భావిస్తున్నాయి. ఆర్జేడీ నుంచి స్పీకర్ ను నియమించాలని కసరత్తులు చేస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీలో, 'మహాగఘటబంధన్' లేదా మహా కూటమికి మొత్తం 164 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.