బ్లూవేల్ ఛాలెంజ్ బ్యాన్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది, మన దేశంలో పదుల సంఖ్యలో యువతీయువకుల ప్రాణాలు తీసిన ఆన్లైన్ బ్లూవేల్ గేమ్పై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది, మన దేశంలో పదుల సంఖ్యలో యువతీయువకుల ప్రాణాలు తీసిన ఆన్లైన్ బ్లూవేల్ గేమ్పై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్పై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
దీనిపై తీసుకుంటున్న చర్యలు తెలియజేస్తూ మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. బ్లూవేల్ గేమ్కు అలవాటు పడుతున్న యువత వాటిలో వచ్చే వివిధ టాస్క్లు పూర్తిచేసే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ గేమ్లో వచ్చే చివరి టాస్క్ ప్రకారం అనేక మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు.
న్యాయవాది ఎన్ఎస్ పొన్నయ్య బ్లూవేల్ గేమ్పై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు బ్లూవేల్ బారినపడి దాదాపు 200 మంది వరకు ఆత్మహత్యకు యత్నించారని పిటిషన్లో వివరించారు.
బ్లూవేల్ గేమ్పై నిషేధం విధించడంతోపాటు ఇటువంటి ప్రాణాంతకమైన ఆటలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరారు. ఇప్పటికే ఆ గేమ్ లింక్లను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గూగుల్ను ఆదేశించింది.