కరోనా డేంజర్ బెల్స్: 90వేలను దాటిన యాక్టివ్ కేసులు; తాజాగా కేసులు, మరణాలు ఎన్నంటే!!
భారతదేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతుంది. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పౌరులకు పలు సూచనలు చేస్తున్నాయి. సామాజిక దూర నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలి అని, వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 15,940 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 20 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. మునుపటి రోజుతో పోలిస్తే కరోనా కేసులు 8శాతం తగ్గినట్లుగా కనిపిస్తోంది. నిన్న 17 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ సంఖ్యలో కొద్దిపాటి తగ్గుదల కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం 91 వేల 779 యాక్టివ్ కేసులతో, కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. నిత్యం రోజువారీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కరోనా యాక్టివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా నమోదైంది. వారానికి పాజిటివిటీ రేటు 3.30 శాతంగా ఉంది. అయితే కేసు మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. తాజాగా నమోదైన మరో 20 మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 5,24,974కి చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,63,103 కాగా మహారాష్ట్రలో 4205 కొత్త కేసులు, కేరళలో 3,981 కొత్త కేసులతో కలిపి మొత్తం 15,940 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 12425 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,27,61,481కి పెరిగింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే గత 24 గంటల్లో 15,73,341 మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పంపిణీ చేసిన టీకాల సంఖ్య 196.94 కోట్లుగా ఉంది.