యూపీ అసెంబ్లీ : విభజన ఊసే ఎత్తని పార్టీలు
ఒకప్పుడు ఓటర్ల మనస్సు దోచేందుకు బ్రహ్మాస్త్రం. కానీ ఇప్పుడు ఆ నినాదాన్ని ఏ పార్టీ అందుకునేందుకు.. అసలు ఆ ఊసేత్తడానికే సిద్ధపడటం లేదు.
లక్నో: ఒకప్పుడు ఓటర్ల మనస్సు దోచేందుకు బ్రహ్మాస్త్రం. కానీ ఇప్పుడు ఆ నినాదాన్ని ఏ పార్టీ అందుకునేందుకు.. అసలు ఆ ఊసేత్తడానికే సిద్ధపడటం లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారీ హరిత ప్రదేశ్ డిమాండ్ ముందుకు తెచ్చే రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ ఆ మాటే ఎత్తడం లేదు.
చిన్న రాష్ట్రాలు - బలమైన కేంద్రం డిమాండ్ ముందుకు తెచ్చిన బీజేపీ సైతం మండళ్ల మంత్రం జపిస్తుండటం గమనార్హం. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరాఖండ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో సుపరిపాలన కోసం.. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలన్న డిమాండ్లు ముందు నుంచి ఉన్నాయి.
పశ్చిమాన జాట్లు ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతాన్ని హరిత్ ప్రదేశ్గా, తూర్పు ప్రాంతాన్ని పూర్వాంచల్, బుందేల్ ఖండ్, మధ్య యూపీని అవధ్ రాష్ట్రంగా విభజించాలని డిమాండ్లు ఉన్నాయి. కానీ ఈ డిమాండ్లను ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అటకెక్కించాయి. అధికార సమాజ్ వాదీ పార్టీ కూడా ఈ డిమాండ్ పై మౌనం వహిస్తున్నది. అభివ్రుద్ధి నినాదానికి ఏమైనా ఆటంకం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన సమాజ్ వాదీలది. ఇక ఆర్ఎల్డీ సరేసరి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదీ అదే బాట.
అసెంబ్లీలో తీర్మానం ఆమోదం..
2007కు ముందు నుంచి మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర విభజన డిమాండ్ను ముందుకు తెచ్చింది. నాటి అధికార సమాజ్ వాదీ పార్టీని ఇరుకున పెట్టేందుకు శాంతిభద్రతలు, రాష్ట్ర ప్రగతి అంశాలే ప్రధానంగా చిన్న రాష్ట్రాల విభజనతో సుపరిపాలన సాధ్యమన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తాను రాసిన భాషాయి రాజ్య పుస్తకంలో ఉత్తరప్రదేశ్ విభజనకు సిఫారసు చేశారని ఆమె చెప్తుంటారు. 2007లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆ తీర్మానంలో ప్రతిపాదించారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతునిచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యతిరేకించింది. మాయావతి సర్కార్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపించారు.
యూపీఏ హయాంలో ఇలా..
కానీ దాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ద్వంద్ద్వంగా తిరస్కరించింది. ఆయా రాష్ట్రాల ఏర్పాటుకు రాజధానుల గుర్తింపు, నిధులు, ఆస్తులు, అప్పుల విభజనకు ప్రాతిపాదిక తెలియజేయలేదని కేంద్రం తీర్మానాన్ని వెనక్కు పంపేసింది. కానీ ఈ దఫా ఎన్నికల్లో మాయావతి గానీ, ఆ పార్టీ నేతలు గానీ ఆ ఊసే ఎత్తడం లేదు. 2007 ఎన్నికల్లో దళిత్ - ముస్లిం - బ్రాహ్మణ్ కాంబినేషన్తో 206 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన మాయావతికి 2012 ఎన్నికల్లో యూపీ వాసులు చుక్కలు చూపారు. 206 స్థానాల నుంచి 80 స్థానాలకు పడిపోయింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర విభజన డిమాండ్ ఊసే ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనే లేదు. ప్రచారసభల్లో మాయావతి మొదలు ఇతర నాయకులు ఆ ఊసే ఎత్తకుండా ప్రచారం సాగిస్తున్నారు.
మండళ్ల ఏర్పాటే శ్రేష్ఠమంటున్న కమలనాథులు
ప్రత్యేకించి 2000లో ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటుచేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి సారధ్యం వహించిన బీజేపీ సైతం ఇప్పుడు అనూహ్యంగా అభివ్రుద్ధి మండళ్ల ఏర్పాటు డిమాండ్ ను ముందుకు తెచ్చింది. రాష్ట్రీయ స్వేయం సేవక్ సంఘ్ తొలి నుంచి రాష్ట్రాల విభజనకు అనుకూలం. రాష్ట్రాలను చిన్నగా చేయడం వల్ల కేంద్రంలో అధికారాన్ని కేంద్రీకరించాలన్నదే అసలు సిసలు ఆలోచన. కానీ కొత్తగా ఏర్పాటైన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్టాలతోపాటు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తలెత్తిన విపరిణామాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం మాట మార్చింది. తొమ్మిది అంశాల సంకల్ప పత్రం పేరిట విడుదలచేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రాలుగా విభజనకు బదులు బుందేల్ ఖండ్, అవధ్, వెస్ట్ యూపీలలో అభివ్రుద్ది మండళ్లు ప్రస్తావన తీసుకొచ్చింది. ఒకవేళ తమకు అధికారం ఇస్తే అభివ్రుద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
హరిత ప్రదేశ్ డిమాండ్ ఇలా..
ప్రతిసారి హరిత ప్రదేశ్ డిమాండ్ను ముందుకు తెస్తున్న రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నాయకుడు అజిత్ సింగ్ ఈ దఫా మౌనంగా వ్యవహరిస్తున్నారు. వెస్ట్ యూపీతోపాటు ఇతర ప్రాంతాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అవధ్, తదితర రీజియన్లలో అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. తద్వారా ఎన్నికల తర్వాత అవసరమైతే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావిస్తున్నారు.
ఇలా అఖిలేశ్కు అధికారం..
అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) తొలి నుంచి రాష్ట్ర విభజన డిమాండ్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ. రాష్ట్ర ప్రజలు కూడా తమ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉండాలని ఆకాంక్షించారని గత ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. దీంతో ఏ రాజకీయ పార్టీ కూడా విభజన డిమాండ్ ను ముందుకు తేలేదని తెలుస్తున్నది. ముస్లింలు, యాదవులకు ఇతోధికంగా అండగా ఉండటం సమాజ్ వాదీ పార్టీకి 2012 అసెంబ్లీ 403 స్థానాల్లో 224 స్తానాల్లో విజయం లభించింది. ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ రాష్ట్రమంతా సైకిల్ యాత్రలు జరుపుతూ పార్టీ బలోపేతం చేశారు. దీనికి తోడు నాటి మాయావతి ప్రభుత్వ వ్యతిరేకత అఖిలేశ్ యాదవ్కు కలిసొచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 7 - 9 శాతం ఓట్లు గల కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమకు కలిసి వస్తుందని సమాజ్ వాదీ పార్టీ అంచనా వేస్తోంది.