జీఎస్టీ ఎఫెక్ట్: అత్యంత చౌకగా లభిస్తున్న ఎల్ఈడీ బల్బులు
ఢిల్లీ: విద్యుత్ శక్తి వినియోగించి పనిచేసే పరికరాల ధరలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం వాటిపై పరోక్ష పన్ను విధానం అమలు చేయడమే. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ వీటిపై విధించడంతో దేశంలోని మధ్యతరగతి వారిపై చాలా మటుకు భారం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత్ జీవన్లో భాగంగా సరఫరా చేస్తున్న విద్యుత్ పరికరాలు అంటే ఎల్ఈడీ బల్బులతో పాటు అన్ని ఉజాలా పథకాలను జీఎస్టీ కిందకు చేర్చడంతో మధ్యతరగతి ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారు.
9వాట్ల ఎల్ఈడీ బల్బు జీఎస్టీ అమలులోకి రాకముందు ధర రూ.310గా ఉండేది. జీఎస్టీ అమల్లోకి రావడంతో అదే 9 వాట్ల ఎల్ఈడీ బల్బు ధర రూ.70కే వస్తోంది. 20వాట్ల ఎల్ఈడీ ట్యూబ్ లైట్ జీఎస్టీ అమల్లోకి వచ్చాక రూ.220, ఐదు స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్ ధర రూ.1200లు మాత్రమే ధర పలుకుతున్నాయి. కొత్త ధరలు వచ్చాక ఆ పరికరాలపై ఉన్న ధరలకన్న పైసా కూడా ఎక్కువ కట్టకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పిలుపునిస్తోంది. ఇప్పటి వరకు ఉజాలా పథకం కింద 7.5 కోట్ల గృహాలు కవర్ అయినట్లు కేంద్రం వెల్లడించింది. 18 అక్టోబర్2018 నాటికి 31,03,69,218 ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసింది కేంద్రం.
5 జనవరి 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజాలా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 77 కోట్ల మామూలు బల్పుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను రీప్లేస్ చేసింది.ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ కూడా చాలా వరకు అంటే 3,244 కోట్ల కిలో వాట్లు ఆదా అయ్యింది. ఏడాదికి వినియోగదారుల సంచిత వ్యయం రూ.12,963 కోట్లుకు తగ్గినట్లు అంచనా. అంతేకాదు ఎల్ఈడీ బల్బుల వినియోగంతో 2.62 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గినట్లు అధికార గణాంకాలు తెలుపుతున్నాయి.
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇదొక పరోక్ష పన్ను. ఇది వస్తువులు సేవలపై విధిస్తారు. ప్రతి ఉత్పత్తిపై జీఎస్టీ విధించడం జరుగుతుంది. అయితే అందరికీ తిరిగి చెల్లించబడుతుంది. గూడ్స్ మరియు సర్వీసెస్ ఐదు శ్లాబుల్లో విభజించడం జరిగింది. ఇది 0%,5%, 12%,18 %, 28% లలో విభజించబడింది. ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాలిక్ పానియాలు, విద్యుత్, లాంటివి కొన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు. వీటికి ప్రత్యేకమైన పన్నులు విధిస్తున్నారు. అది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి.