ఒక్కటైన ఐడియా- వొడాఫోన్.. అతిపెద్ద టెలికాం కంపెనీగా ఆవిర్భావం
ఐడియా, వొడాఫోన్ ఇండియా.. రెండూ కలిసిపోయి భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా అవతరించాయి.
న్యూఢిల్లీ: ఐడియా, వొడాఫోన్ ఇండియా.. రెండూ కలిసిపోయి భారత్ లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా అవతరించాయి. ఈ రెండు సంస్థల విలీనాన్ని ఇవాళ అధికారింగా ప్రకటించాయి.
రెండు కంపెనీల విలీనంతో వీటి మొత్తం వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు చేరింది. అంటే.. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ముగ్గురు మొబైల్ వినియోగదారుల్లో ఒకరు ఈ సంస్థలకు చెందిన వారే.
ఇప్పుడు దేశంలో అతి పెద్ద నెట్ వర్క్ తమదేనని ఈ సంస్థలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థలకు దీటుగా ఇప్పుడు ఈ రెండు సంస్థలు నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాదికల్లా ఈ విలీనం పూర్తవుతుందని, ఈ విలీనం వల్ల కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్ సాకారం చేయడంలో ఆదిత్య బిర్లా గ్రూప్ తన వంతు పాత్రను పోషించనుందని ఆ గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు.
ఈ విలీనం తరువాత సంస్థలో వొడాఫోన్ వాటా 45.1 శాతం. అందులో 4.9 శాతం(రూ.3874 కోట్లు)ను వొడాఫోన్ ఇండియా ప్రమోటర్లు, దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేస్తుందని ఐడియా ప్రకటించింది.
ఇక సంస్థలో ఐడియా ప్రస్తుత వాటా 26 శాతం కాగా, భవిష్యత్తులో వొడాఫోన్ షేర్లను కొనుగోలు చేసి సమాన వాటా పొందే హక్కు ఐడియాకు ఉంటుంది. కొత్త సంస్థకు ఛైర్మన్ ను ఎంపిక చేసే హక్కు కూడా ఐడియాకే ఉంటుంది. ఈ విలీనాన్ని భారత టెలికాం సెక్టార్ కి, ఆ సంస్థలకు శుభసూచకంగానే నిపుణులు భావిస్తున్నారు. ఈ విలీన ప్రకటన రాగానే ఐడియా షేర్లు ఏకంగా 14 శాతం పెరిగాయి.