30గంటల ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం, మరో జవాను మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ దాదాపు 30 గంటలు గడిచిన తర్వాత.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో ఓ కొలిక్కి వచ్చింది. రాత్రంతా పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
కరణ్ నగర్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై నిన్న ముష్కరులు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.
సమర్థంగా అడ్డుకున్న సైన్యం
అయితే ముష్కరులను శిబిరంలోకి ప్రవేశించకుండా సైన్యం సమర్థంగా అడ్డుకోగలిగింది. కానీ, తర్వాత ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీసు గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే మరో జవాను కూడా మంగళవారం మృతి చెందాడు.
భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు
సోమవారం ఉదయం సీఆర్పీఎఫ్ శిబిరం సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులు, భారీ ఆయుధాలతో కూడిన బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడే గస్తీ కాస్తున్న ఓ జవాను వారిని గుర్తించారు. దీంతో ఆ ఇద్దరూ తప్పించుకుని పారిపోయి ఓ భవనంలో దాక్కున్నారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
దీంతో సోమవారం నుంచి సైన్యం, పోలీసులు ముష్కరులను బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులు భవనంలోకి చొరబడగానే పోలీసులు, సైన్యం భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా, మంగళవారం ఉదయం ఆ ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టడంతో ఎన్కౌంటర్ ముగిసింది.
ఉగ్రవేట కొనసాగుతోంది..
అయితే, ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉగ్రవేట కొనసాగిస్తున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల లష్కరే తోయిబా ఉగ్రవాది నవీజ్ జట్ అలియాస్ అబూ హంజాలాను ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిపై దాడిచేసి విడిపించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే.