జయలలిత ఆస్తుల కేసుపై సుప్రీంలో ఇంకా ఉత్కంఠనే
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసును విచారించిన సుప్రీం కోర్టు మంగళవారం నాడు తీర్పును రిజర్వ్లో ఉంచింది.
అక్రమాస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ కర్ణాటక ప్రభుత్వం, ఇతర పిటిషన్దారులను జూన్ 10లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన కేసు విచారణ గత వారం పూర్తయింది.
జయలలిత అక్రమాస్తుల కేసు సుదీర్ఘంగా పద్దెనిమిదేళ్ల పాటు విచారణ జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆమెను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు గత ఏడాది ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. జయలలితను నిర్దోషిగా విడుదల చేయడంపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.