జయ మేనకోడలు దీపా ఫ్యామిలీ గొడవ: నడిరోడ్డులో రాళ్లతో దాడులు !
జయలలిత మేనకోడలు దీపా, ఆమె భర్త మాధవన్ ఇంటి పోరు రోడ్డెక్కింది. టీ నగర్ లోని దీపా ఇంటి ముందు ఆమె అనుచరులు, మాధవన్ అనుచరులు రాళ్లు, నీళ్ల బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకుని రచ్చరచ్చ చెయ్యడంతో పోలీసులు రం
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి దీపా జయకుమార్ కుటుంబ గొడవ రోడ్డు మీదపడింది. దీపా అనుచరులు, ఆమె భర్త మాధవన్ అనుచరులు నడిరోడ్డు మీద ఒకరి మీద ఒకరు రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడులు చేసుకోవడంత వారి ఇంటి పోరు రోడ్డ మీదకు వచ్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
గొడవ జరుగుతున్న సమయంలో దీపా గట్టిగా కేకలు వేసినా ఇరు వర్గాలు పట్టించుకోకుండా ఒకరిమీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఇన్ని రోజులు ఇంటి పోరు గురించి గుసగుసలాడుకున్న దీపా అనుచరులు ఇప్పుడు రోడ్ల మీదనే చర్చ మొదలు పెట్టారు. ఈ మొత్తం గొడవ చెన్నైలోని టీ నగర్ లోని దీపా ఇంటి దగ్గరే జరగడం కొసమెరుపు.
జయలలిత వారుసురాలు
జయలలిత వారుసురాలిగా తెరమీదకు వచ్చిన దీపా అన్నాడీఎంకే పార్టీని స్వాధీనం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే శశికళ వర్గం అడ్డుకోవడంతో తాను సొంతంగా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై స్థాపిస్తున్నానని దీపా ప్రకటించారు.
డ్రైవర్, ఆయన భార్య
ఎంజీఆర్ అమ్మ దీపా పేరవైని స్థాపించిన తరువాత దీపా తన డ్రైవర్ ఏవీ రాజ, ఆయన భార్యకు కీలకపదవులు ఇచ్చారు. తాను సిఫారస్సు చేసిన వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వలేదని దీపా భర్త మాధవన్ గొడవ పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే పేరవైలోని పెద్దలు జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఆయన దీపా ఇంటికి వచ్చారు.
మళ్లీ రచ్చరచ్చ
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల నామినేషన్ పత్రాల్లో దీపా భర్త కాలమ్ ను ఖాళీగా పెట్టారు. ఈ విషయం మీడియాలో రావడంతో మాధవన్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ భార్య దీపాతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఒక దశలో దీపా, మాధవన్ ఇద్దరూ విడాకులు తీసుకుంటారని ప్రచారం జరిగింది.
అంబేద్కర్ జయంతి ఏర్పాట్లు
దీపా ఇంటి ముందు శుక్రవారం అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు జరిగాయి. మాధవన్ అన్నాడీఎంకే రంగు పంచెకట్టుకుని తన అనుచరులతో కలసి టీ నగర్ లోని దీపా ఇంటి దగ్గర జరుగుతున్నఅంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. అయితే మాధవన్, ఆయన అనుచరులను దీపా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
గేటు తోసుకుని
దీపా అనుచరులు, మాధవన్ అనుచరులు వాగ్వివాదానికి దిగడంతో అదే సమయంలో దీపా డ్రైవర్ ఏవీ రాజ అక్కడికి వచ్చారు. మాధవన్ అనుచరులను దీపా డ్రైవర్ ఏవీ రాజ, అతని అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైయ్యింది. ఈ మొత్తం గొడవకు నువ్వే కారణం అంటూ మాధవన్ అనుచరులు డ్రైవర్ ఏవీ రాజా మీద మండిపడ్డారు.
గాల్లోకి లేచిన రాళ్లు, నీళ్ల బాటిళ్లు
ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరగడంతో సహనం కోల్పోయి ఒకరి మీద ఒకరు నీళ్ల బాటిళ్లు, రాళ్లు రువ్వుకున్నారు. చేతికి చిక్కిన వస్తువులు తీసుకని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆసమయంలో ఆ ప్రాంతం రణరంగం అయ్యింది.
కేకలు వేసిన దీపా, రంగంలోకి పోలీసులు
ఇరు వర్గాలు ఘర్షణ పడవద్దని దీపా పదే పదే కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీపా డౌన్ డౌన్ అంటూ మాధవన్ వర్గీయులు నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మాధవన్ అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. మొత్తం మీద ఇంత కాలం ఇంటికే పరిమితం అయిన దీపా, మాధవన్ పోరు రోడ్డెక్కింది.