మారన్ సోదరులకు బిగ్ రిలీఫ్: ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో 'నిర్దోషులు'
వీరిద్దరిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నింటిని తోసిపుచ్చిన పటియాలా హౌజ్.. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్-మాక్సిస్ కేసు నుంచి మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ లకు ఊరట లభించింది.అవినీతి, మనీలాండరింగ్ కేసులో మారన్ సోదరులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నింటిని తోసిపుచ్చిన పటియాలా హౌజ్.. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు కోర్టు తీర్పు వెలువరించింది. కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.
దీంతో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ సహా కళానిధి భార్య కావేరీ, సౌత్ ఏసియా ఎఫ్ఎం లిమిటెడ్ కంపెనీ ఎండీ, సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ఊరట లభించింది.
దయానిధి మారన్, కళానిధి మారన్ సహా కేసులో నిందితులుగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. తొలుత సీబీఐ మరియు ఎన్ఫోర్స్ డైరెక్టోరేట్(ఈడీ) వాదనలు విన్న కోర్టు.. వారి వాదనలతో ఏకీభవించలేదు. కోర్టు తీర్పుపై దయానిధి మారన్ సంతోషం వ్యక్తం చేశారు.
మారన్ ఇళ్లకు 770 హైకెపాసిటీ డేటా కేబుళ్లు
కాగా, యూపీఎం హయాంలో దయానిధి మారన్ టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ సెల్ లో అతిపెద్ద వాటాదారు శివశంకరన్ తో బలవంతంగా వాటా అమ్మించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే తన పలుకుబడితో మలేషియా వ్యాపారవేత్త టి.ఎ ఆనందకృష్ణన్ కు సహాయం చేశారన్న అభియోగం కూడా ఉంది.
ఇవిగాక మాక్సిస్ అనుబంధ సంస్థ అయిన గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ.4866కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందేందుకు దయానిధి మారన్ వ్యవహారం నడిపారని, ఇందుకుగాను ఆయనకు భారీగా ముడుపులు అందాయని అభియోగాలు ఉన్నాయి.