నోకియా సంచలనం: ఎయిర్టెల్తో కలిసి 5జీ లాంచింగ్!..
ఇప్పటికే 3జీ, 4జీ సేవలను చాలా ఆలస్యంగా స్వీకరించిన భారత్, 5జీ సేవలను మాత్రం త్వరగానే స్వీకరిస్తుందని టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఒకప్పుడు సెల్ఫోన్ అంటే నోకియా అన్నంతగా ఆ బ్రాండ్ జనాల్లోకి వెళ్లగలిగింది. కానీ కాల క్రమంలో పుట్టుకొచ్చిన స్మార్ట్ ఫోన్ల ధాటికి నోకియా కనుమరుగవక తప్పలేదు. తిరిగి ఇన్నాళ్లకు నోకియా మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ దఫా 5జీ కనెక్టివిటీతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించేందుకు నోకియా కసరత్తులు మొదలుపెట్టింది.
దేశీయ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తో కలిసి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చే యోచనలో నోకియా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంఓయూపై నోకియా సంతకం కూడా చేసిందని ఎకనమిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

5జీ కనెక్టివిటీ లాంచింగ్ పై నోకియా భారత మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహక దశలో ఉన్నామని అన్నారు. ఇందుకోసం బెంగుళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్ లో ఓ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఇండియాలో 5జీ ప్రాధాన్యత, వాటాదారుల అసరాల రీత్యా ఈ సెంటర్ ఉపయోగపడుతుందని సంజయ్ పేర్కొన్నారు. దేశంలో ఈ కొత్త టెక్నాలజీని త్వరగా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, 2022 కల్లా ఇది జరగవచ్చునని అన్నారు. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో 2020లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
ఇప్పటికే 3జీ, 4జీ సేవలను చాలా ఆలస్యంగా స్వీకరించిన భారత్, 5జీ సేవలను మాత్రం త్వరగానే స్వీకరిస్తుందని టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ తెలిపారు. ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్ ను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications