డిఫ్యూజన్ నోటీస్: మోడీ సహా ఫ్యామిలీ ఇలా చెక్కేసింది
Recommended Video
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన సూత్రధారి నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులపై ఇంటర్పోల్ అప్రమత్తమైంది. వారిపై డిఫ్యూజన్ నోటీసు జారీ చేసింది.
నీరవ్ మోడీపైనే కాకుండా ఆయన భార్య అమీ మోడీ, సోదరుడు నిషాల్ మోడీ, ఆయన వ్యాపార భాగస్వామి, అంకుల్ మహెుల్ చోక్సీలపై డిఫ్యూజన్ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
పాస్పోర్టు రద్దుకు సిబిఐ
బిలియనీర్ జువెల్లరీ డిజైనర్ నీరవ్ మోడీ, ఆయన భాగస్వామి మెహుల్ చోక్సీ పాస్పోర్టులను రద్దు చేయాలని సిబిఐ కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన 150 అవగాహన లేఖలతో రూ.11,300 కోట్ల అక్రమ లావాదేవీల కేసులో వారిద్దరు ప్రధాన నిందితులు.
మరో 8 మంది ఉద్యోగుల సస్పెన్షన్
భారీ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుక్రవారం మరో 8 మందిఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో సస్పెన్షన్కు గురైన ఉద్యోగుల సంఖ్య 18కి చేరుకుంది. సస్పెండ్ అయినవారలో జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అంతర్గత విచారణ జరుగుతున్నట్లు బ్యాంక్ తెలిపింది.
నీరవ్ మోడీ ఇలా పారిపోయాడు
భారతదేశానికి సంబంధించిన పాస్పోర్టు ఉన్న నీరవ్ మోడీ జనవరి 1వ తేదీన దేశం విడిచి పారిపోయాడు. బెల్జియం పౌరుడైన ఆయన సోదరుడు నిషాల్ అదే రోజు దేశం నుంచి చెక్కేశాడు.వారిద్దరు కలిసి వెళ్లారా, విడివిడిగాగ వెళ్లిపోయారా అనేది తెలియదు.
నీరవ్ మోడీ భార్య ఇలా...
నీరవ్ మోడీ భార్య అమీ అమెరికా పౌరురాలు.. ఆమె జనవరి 6వ తేదీన భారత్ వదిలి వెళ్లారు. మోడీ అంకుల్, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీ జనవరి 4వ తేదీన పారిపోయాడు. ఆయన గీతాంజలి జువెల్లర్స్ చైన్ ప్రమోటర్.
బ్యాంక్ చేసిన జాప్యం వల్లనే....
ఫిర్యాదు చేయడంలో బ్యాంక్ చేసిన జాప్యం వల్లనే పాస్పోర్టుల రద్దుకు వీలు కాలేదని అంటున్నారు. బ్యాంక్కు జనవరి 16వ తేదీన అనుమానాలు కలిగాయి. విదేశీ సరఫరాదారులకు చెల్లింపులు జరపడానికి అవగాహన లేఖలు ఇవ్వాలని కోరుతూ దిగుమతి పత్రాలతో డైమండ్ ఆర్ యుఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ వచ్చినప్పుడు ఆ అనుమానాలు కలిగాయి. ఆ కంపెనీలు కేసులో నిందితులుగా ఉన్నాయి. దాంతో బ్యాంక్ జనవరి 29వ తేదీన సిబిఐకి ఫిర్యాదు చేసింది.