దయ వద్దు: రాజీవ్ హంతకుల మెర్సీ పిటిషన్పై కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల శిక్షను తగ్గించవద్దని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరింది. ముగ్గురు నిందితులు తమకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని మెర్సీ పిటిషన్లు పెట్టుకున్నారు. వారికి విధించిన శిక్షను జీవిత ఖైదుగా మార్చవద్దని కేంద్రం కోరింది. కాగా, కోర్టు తన తీర్పును రిజర్వ్లో పెట్టింది.
తాము పెట్టుకున్న మెర్సీ పిటిషన్లపై నిర్ణయంలో జాప్యం జరిగినందున తమకు విధించిన శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ తమిళనాడుకు చెందిన పెరారివలన్, శంతన్, మురగన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దయ చూపడానికి వారు అర్హులు కారని అటార్నీ జనరల్ గులాం వాహనవతి సుప్రీంకోర్టు ముందు చెప్పారు
వారు క్రమశిక్షణతో మెలుగుతున్నారని, ఖైదీలకు వినోదాన్ని అందిస్తున్నారని, చదువు చెబుతున్నారని, జాప్యం వల్ల వారికి వేదన లేదని, వారు హింసకు గానీ అమానవీయతకు గానీ గురి కావడం లేదని వాహనవతి అన్నారు.
ముగ్గురు దోషులు కూడా మరణశిక్షకు అర్హులని వాహనవతి అన్నారు. వారి మెర్సీ పిటిషన్లు రాష్ట్రపతికి పంపించడానికి 11 ఏళ్లు జాప్యం కావడానికి గల కారణాలను వివరించారు. ఎన్డీఎ ప్రభుత్వం ఆ ఫైళ్లను నాలుగేళ్లకు పైగా పరిశీలించిందని, రాష్ట్రపతికి పంపించలేదని చెప్పారు.