వరుస షాకులు: మాండ్య ఎంపి రమ్యకు కొత్త చిక్కు!
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాండ్య లోకసభ నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రమ్యకు కొత్త చిక్కు వచ్చి పడింది. రమ్య మాండ్య లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను రమ్యకు తండ్రిని అంటూ కోర్టు మెట్లు ఎక్కారు.
కాంగ్రెసు పార్టీలో చేరిన రమ్య గత ఉప ఎన్నికలలో మాండ్య నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆమె మరోసారి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి బరిలో నిలుచున్నారు. ఇలాంటి సమయంలో తాను తండ్రిని అంటు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అయితే, తాను గతంలోను ఈ విషయమై కుటుంబ కోర్టుకు వెళ్లానని చెబుతున్నారు.
మాండ్య నుండి ఎంపీగా ఉన్న రమ్యకు మొదటి నుండి చిక్కులు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నటుడు అంబరీష్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన అభిమానుల ఆగ్రహానికి ఆమె లోనయ్యారు. దానిపై రమ్య వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇటీవల ప్రచారంలో అసంతప్తుల బెడద కనిపించింది.
కాగా, రమ్యకు తాను తండ్రిని అంటూ ఓ వ్యక్తి కోర్టుకు ఎక్కారు. తాను రమ్యకు తండ్రిని అని న్యాయస్థానం ప్రకటించాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వెంకటేష్ బాబు అనే వ్యక్తి తాను రమ్య తండ్రిని అంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
తాను రమ్యకు తండ్రిని అని, తన భార్య రంజిత ఆమె భార్య అని నిరూపించేందుకు తాను సిద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను రంజితను 1981 జూన్ 22న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పారు. రమ్య 1982 నవంబర్ 29న పుట్టిందని పేర్కొన్నారు.
రమ్యకు ఐదేళ్లు వచ్చే వరకు తాము ఒకే దగ్గర ఉన్నామని, ఆ తర్వాత రమ్యను తీసుకొని రమ్య వేరుగా వెళ్లిపోయారన్నారు. తిరిగి రావాలని తాను కోరినప్పటికీ తన భార్య రాలేదన్నారు. రమ్య తన కూతురు అన్న విషయం 2005లో తనకు తెలిసిందని, తాను రంజిత వద్దకు వెళ్లి అడగాలనుకుంటే... తనను ఇంటిలోకి రానివ్వలేదని, అవమానించారని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి తాను 2006లో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు. అయితే, వారు కోర్టుకు హాజరు కాలేదన్నారు. తాను రమ్యకు తండ్రిని అనే విషయం అందరికీ తెలియాల్సి ఉందని, అందుకే కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. కాగా, రమ్య మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.