తరగతిలో గుట్కా ప్యాకెట్లు; అడిగిన ఉపాధ్యాయుడిపై విద్యార్థుల వీరంగం; షాకింగ్ వీడియో వైరల్
తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అంతటి స్థానాన్ని ఇచ్చారు. ఒకప్పుడు విద్యార్థులకు విద్యను నేర్పించే గురువులు అంటే ఎనలేని భక్తి భావం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో అది కాస్తా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఉపాధ్యాయుల పట్ల గౌరవం తగ్గటమే కాదు కొన్ని చోట్ల విద్యార్థుల అనుచిత ప్రవర్తన కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన విద్యార్థులు ఇంత దారుణంగా తయారయ్యారా అన్న భావనకు కారణంగా మారుతోంది. ఇంతకీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన వివరాలలోకి వెళితే
కర్ణాటక రాష్ట్రంలో టీచర్ తో విద్యార్థుల అసభ్య ప్రవర్తన
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ టీచర్తో విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తూ అతని తలపై డస్ట్బిన్ను వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షాకింగ్ అనిపించినా ఈ ఘటనపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. వీడియోలో కనిపించిన ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి పట్టణంలోని నల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినది. డిసెంబరు 3 వ తేదీన ఈ ఘటన జరిగినట్టు అధికారులు గుర్తించారు.
టీచర్ పై డస్ట్ బిన్ వేసి విద్యార్థుల వీరంగం
విద్యార్థినుల్లో ఒకరు టీచర్పై డస్ట్బిన్ వేసి మరీ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఒక విద్యార్థి తరగతిలో ఉపాధ్యాయుడు బోధించడం ప్రారంభించినప్పుడు ఉపాధ్యాయుడి తలపై డస్ట్బిన్ విసిరాడు. కొందరు విద్యార్థులు ఇదే సమయంలో లేచి బాగా గొడవ చేశారు. ఉపాధ్యాయుడిని గేలి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన చూసిన కర్ణాటక విద్యా శాఖ స్పందించింది.
ఘటనపై విచారణకు ఆదేశించిన విద్యాశాఖా మంత్రి .. చర్యలకు ఆదేశం
ఈ ఘటనపై ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పందిస్తూ.. 'దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేయడాన్ని సహించేది లేదని.. దీనిపై విచారణ చేస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి విద్యాశాఖ, పోలీసులు.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాము ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని, ఉపాధ్యాయుడితో అనుచితంగా ప్రవర్తించి, ఉపాధ్యాయుడు తలపై డస్ట్ బిన్ వేసిన విద్యార్థులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు ఉపాద్యాయుల పట్ల గౌరవ భావంతో ప్రవర్తించాలని మంత్రి చెప్తున్నారు.
Recommended Video
నేలపై చెత్తాచెదారం, గుట్కా ప్యాకెట్లు ఉండటంతో విద్యార్థులపై టీచర్ ఆగ్రహం, ఆపై విద్యార్థుల దాడి
ఇక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు నేలపై చెత్తాచెదారం గుట్కా ప్యాకెట్లను చూశానని దీంతో ఆయన విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలని కోరానని వెల్లడించారు. ఆ తర్వాత పాఠం బోధించడం ప్రారంభించినప్పుడు, వారిలో కొందరు ఒక్కసారిగా ఉపాధ్యాయుడు పై దాడికి ప్రయత్నించారు. కొందరు డస్ట్ బిన్ తన తలపై వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని ఆయన కనీసం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యా శాఖ విచారణకు ఆదేశించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కర్ణాటక విద్యా శాఖ నిర్ణయించింది.