జమ్మూ కాశ్మీర్ లో అనుమానాస్పద డ్రోన్; బీఎస్ఎఫ్ కాల్పులు; 3 మాగ్నెటిక్ ఐఇడిలు స్వాధీనం
జమ్మూకాశ్మీర్ సరిహద్దులలో అనుమానాస్పద డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. ఇక వీటిని నిర్వీర్యం చెయ్యటం భద్రతా సిబ్బందికి పెద్ద పనిగా మారింది. తాజాగా భద్రతా సిబ్బంది అఖ్నూర్లో డ్రోన్ తిరుగుతున్న శబ్దాన్ని గమనించి కాల్పులు జరిపి ఆ డ్రోన్ లకు అమర్చి ఉన్న ఉన్న 3 మాగ్నెటిక్ ఐఈడిలను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ ప్రాంతంలో సుమారు 800 మీటర్ల ఎత్తులో డ్రోన్ కదులుతున్న సౌండ్ విని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) దళాలు రెండు రౌండ్లు కాల్పులు జరిపాయి. బిఎస్ఎఫ్ సిబ్బంది కనాచక్ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలను గమనించి డ్రోన్పై బుల్లెట్లను ప్రయోగించింది. ఆపై వెంటనే పోలీసు పార్టీని మోహరించారు. అంతే కాదు నిన్న రాత్రి కూడా యాంటీ-డ్రోన్ SOP ద్వారా కనాచక్లోని దయారన్ ప్రాంతంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో, పోలీసు పార్టీ డ్రోన్ కార్యకలాపాలను గమనించి కాల్పులు జరిపారు.
డ్రోన్కు అమర్చిన పేలుడు పదార్థాలను కూడా బిఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. డ్రోన్ కు అమర్చిన పిల్లల టిఫిన్ బాక్సుల్లో మూడు మాగ్నెటిక్ ఐఇడిలు ఉన్నాయి. ఇక వీటిలో నియంత్రిత విధానంలో వివిధ సమయాలకు టైమర్ సెట్ చేయబడింది. ఇది గుర్తించిన భద్రతా సిబ్బంది ఐఇడి లను స్వాధీనం చేసుకుని వాటిని క్రియారహితం చేశారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ప్రకారం, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రతిచోటా డ్రోన్-ముప్పు ఉంది. అయితే ఈ ప్రాంతంలో సరిహద్దు దాటి చేస్తున్న కుట్రలను విఫలం చేయడానికి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.
సరిహద్దు వెంబడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆర్మీ, బీఎస్ఎఫ్లు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)పై కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కుప్వారాలో ఇద్దరు ఎల్ఇటి ఉగ్రవాదులు హతమయ్యారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, అందులో ఒక పాకిస్థాన్ ఉగ్రవాది తుఫైల్ కూడా హతమయ్యారని ఐజీపీ కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. కుప్వారాలోని చక్తారాస్ కండి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.