శశికళ వ్యూహం: నరేంద్ర మోడీని ఢీకొంటారా?
జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్న బిజెపిని శశికళ అడ్డుకుంటారా... ఆమె అందుకు ఏ విధమైన వ్యూహం అనుసరించబోతున్నారు...
జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్న బిజెపిని శశికళ అడ్డుకుంటారా... ఆమె అందుకు ఏ విధమైన వ్యూహం అనుసరించబోతున్నారు...
చెన్నై: జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో కాలు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ తిప్పికొడుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, శశికళను చక్రబంధంలో ఇరికించాలనే ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నుంచి సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఐటి దాడుల వ్యవహారం ఓ వైపు నడుస్తుండగా, శశికళను కలుసుకున్నందుకు రాజ్భవన్ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సర్లకు తాఖీదులు జారీ చేసినట్లు తెలుస్తోంది. శశికళను కలవడంపై వివరణ ఇవ్వాలని రాజభవన్ వీసీలను ఆదేశించినట్లు చెబుతున్నారు.
శశికళను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే శేఖర్ రెడ్డి, రామ్మోహన్ రావు, తదితరులపై ఐటి దాడులు జరుగుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. అన్నాడియంకె మద్దతును పొందే ఉద్దేశంతోనే కాకుండా క్రమంగా తమిళనాడులో ఉనికిని చాటుకునే దిశగా బిజెపి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి పరోక్షంగా శశికళను టార్గెట్ చేస్తూ ప్రధానికి లేఖ రాయడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.
పన్నీర్ సెల్వం సిఎంగా ఉంటేనే..
శశికళకు బదులు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉంటే తమకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో బిజెపి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. పలువురు ఉన్నతాధికారులను, మంత్రులను టార్గెట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
శశికళ అర్థిక మూలాలు దెబ్బ తీయడానికి..
శశికళ ఆర్థిక మూలాలను దెబ్బ తీయడానికి వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. సోమవారం నుంచే శశికళ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే విధంగా దాడులకు పురికొల్పనున్నట్లు చెబుతున్నారు. ఇందుకుగాను, ఉద్రిక్తతలు పెరగకుండా 20 పారామిలిటరీ బలగాలను దించినట్లు సమాచారం.
ముందే జాగ్రత్త పడిన శశికళ
బిజెపి వ్యూహాన్ని తిప్పికొట్టడానికి ప్రతివ్యూహరచన చేసి అమలు చేయడానికి శశికళ సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందుకు ఈ నెల 29వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29వ తేదీన జరిగే సమావేశంలో తనకు అనుకూలంగా పార్టీ మొత్తం నిలబడే విధంగా ఆమె వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే గనుక జరిగితే బిజెపి వ్యూహం దెబ్బతిన్నట్లే భావించాల్సి ఉంటుంది.
బిజెపికి అవకాశం ఇస్తే అంతే..
బిజెపికి అవకాశం ఇస్తే పూర్తి కాలం దాసోహం చేయాల్సిందేననే విషయం శశికళకు తెలుసు. జయలలిత బయటకు కనిపించినప్పటికీ వ్యూహాలు రచించి అమలు చేసింది శశికళనే అంటారు. అందువల్ల బిజెపి వ్యూహాన్ని తిప్పికొట్టగలిగే రాజకీయ చాతుర్యం శశికళకు ఉందని అంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగి పోయినట్లుగా కూడా భావిస్తున్నారు.