మహా సంక్షోభం: బలపరీక్ష మేమే నెగ్గుతాం.. 21 మంది ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పీక్కి చేరింది. బల ప్రదర్శనకు షిండే- ఉద్దవ్ సై అంటున్నారు. ఉద్దవ్ పైకి రాజీనామాస్త్రం సంధించినా.. లోన మాత్రం ఎమ్మెల్యేలను తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. కైలాశ్ పాటిల్, నితిన్ దేశ్ముఖ్.. షిండే క్యాంపు నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తెలిపారు. వారిద్దరూ ప్రాణాలకు తెగించి మరీ తిరగి వచ్చేశారని వివరించారు.
ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వారి బారి నుంచి నితిన్, కైలాస్ మాత్రం తిరిగి వచ్చారని వివరించారు. అంతేకాదు తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తెలిపారు. వారు తిరిగి వస్తారని పేర్కొన్నారు. దీంతో బలపరీక్ష జరిగినా.. తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కిడ్నాప్ అంశానికి సంబంధించి కైలాస్ పాటిల్ స్పందించారు. తమను బలవంతంగా గుజరాత్ తీసుకెళ్లారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో శివసేన నేత, మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగబాటు ఎగరవేశారు. తొలుత 21 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్ వెళ్లారు. ఇప్పుడు ఆ సంఖ్య 42కి చేరింది. ఏక్నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అదీ ఇప్పుడు బయటపడింది. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావించారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలో ఈ పరిణామం జరిగింది.
మరోవైపు శివసేన ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ కూడా పరిస్థితిని నిశీతంగా గమనిస్తోంది. పార్టీ నేతలతో అధినేత శరద్ పవార్ సమావేశం అయ్యారు. ఈ ఆపద సమయంలో ఉద్దవ్ థాకరే వెంట ఉంటామని తెలిపారు. ఇప్పుడు తమ అధికారం కోల్పోతే సిద్దంగా ఉండాలని.. తర్వాత జరిగే రాజకీయ పోరాటానికి రెడీగా ఉండాలని కోరారు.