కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?
దక్షిణ చైనా సముద్రంపై పట్టు బిగించేందుకే చైనా భూటాన్ను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు అలీసా ఏరెస్.
న్యూయార్క్: డోక్లాం ప్రాంతంలో చైనా-భారత్ మధ్య వివాదం ముదురుతూనే ఉంది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంతో.. భారత్ భారీగా బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు చైనా మాత్రం భూటాన్ సరిహద్దులో తమ దేశం నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకే భారత్ కుటిల యుక్తులు పన్నుతోందని ఆరోపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో డోక్లామ్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
చైనా కుట్ర:
ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న అమెరికా మాత్రం చైనా దుందుడుకు చర్యల వెనుక మరో కారణం ఉందని అంచనా వేస్తోంది. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతున్న పథకమే అని, గతంలో చైనా చేసిన ఉదంతాలను గమనిస్తే ఇది కూడా అర్థమవుతుందని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భూటాన్ను భయపెట్టి?:
దక్షిణ చైనా సముద్రంపై పట్టు బిగించేందుకే చైనా భూటాన్ను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న చైనా.. దానిపై తమదే ఆధిపత్యం అని చెబుతోంది.
అమెరికా అభిప్రాయం:
ఇందుకోసం సరిహద్దు దేశాలైన ఫిలిప్పీన్స్, మయన్మార్, జపాన్ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, అదే బాటలో ఇప్పుడు భూటాన్ పై కూడా అదే పథకాన్ని అమలు చేస్తోందని ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ శాఖాధికారిగా వ్యవహరించిన అలీసా ఏరెస్ అన్నారు.
ఒక్కో అంగుళం కబళిస్తూ..
ఇక భారత్ గురించి ప్రస్తావిస్తూ.. అక్కడి చాలామంది లాగే తాను కూడా చైనా చర్యలపై ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ అంగుళం చొప్పున దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని చైనా కబళిస్తోందని అన్నారు. అలీసా ఏరెస్ ప్రస్తుతం 'కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్'లో భారత్, పాకిస్థాన్, దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ ఫెలోగా వ్యవహరిస్తున్నారు.