పులివెందులకు పులిబిడ్డ: కడప గడపలో షర్మిళ టూర్.. వివరాలివే
వైఎస్ఆర్ కూతురు షర్మిళ కడప వెళ్లనున్నారు. ఆమె సోమవారం పులివెందుల వెళతారు. క్యాజువల్గా అయితే ఫరవావలేదు కానీ రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. ఆమె చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు. కుటుంబసభ్యులతో కలిసి వివేకానందారెడ్డికు నివాళులర్పిస్తారు.
బెంగళూరు నుంచి నేరుగా కడపకు షర్మిళ వెళ్తారు. 2019 మార్చి 16న వివేకానందరెడ్డి దారుణ హత్య గురయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపన కోసం షర్మిల పార్టీని స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నారు. జగన్, ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని కోరితే.. తెలంగాణ కోడలిగా తాను ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుతున్నానని తెలిపారు. జగన్కు, తనకూ మధ్య పార్టీపరమైన విభేదాలు తప్ప.. వ్యక్తిగతమైన విభేదాలు లేవని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం జగన్ను ఎదిరించడానికి కూడా సిద్ధమని షర్మిల స్పష్టం చేశారు. సొంత పార్టీ అని వేరు కుంపటి పెట్టిన షర్మిల మొదటిసారిగా పులివెందులకు వెళ్తున్నారు. అయితే పులివెందులలో షర్మిలకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనే ఉత్కంఠ నెలకొంది. స్థానిక నేతలు సహకరిస్తారా..? లేదంటే సహాయ నిరాకరణ ఎదురవుతోందా అనే సందేహాలు వస్తున్నాయి. వివేకానందరెడ్డి వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒకవేళ హాజరయితే అన్నా చెల్లెళ్ల మధ్య పలకరింపులపై కూడా పెద్ద దుమారం చెలరేగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.