కరీంనగర్లో కాల్పుల కలకలం... ఆస్తి వివాదంలో సోదరుల పైనే కాల్పులు...
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఆస్తుల విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య తలెత్తిన గొడవ కాల్పులకు దారితీసింది. కాల్పుల ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానప్పటికీ... అంతకుముందు జరిగిన ఘర్షణలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం కాల్పులు చోటు చేసుకోలేదని... దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం గమనార్హం.
బాధితుల కథనం ప్రకారం... కరీంనగర్లోని వాసవి టవర్స్ ప్రాంతానికి చెందిన ఐదుగురు సోదరుల మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం నెలకొంది. ఈ విషయమై తరుచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం(జులై 16) రాత్రి అన్నాదమ్ముళ్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఐదుగురు సోదరుల్లో పెద్దవాడైన సయ్యద్ అజ్గర్ హుస్సేన్ మిగతా సోదరులు సయ్యద్ ఆల్తాఫ్ హుస్సేన్, సయ్యద్ సహీద్ హుస్సేన్, సయ్యద్ అఖిల్ హుస్సేన్, సయ్యద్ షహీల్ హుస్సేన్లతో గొడవపడ్డాడు.అనంతరం కత్తితో దాడికి యత్నించాడు.
నలుగురు సోదరులు అతన్ని అడ్డుకుని కత్తిని లాక్కున్నారు. దీంతో అజ్గర్ హుస్సేన్ గన్ బయటకు తీసి రెండుసార్లు కాల్పులు జరిపాడు. సోదరులు తప్పించుకోవడంతో ఆ బుల్లెట్లు అజ్గర్ కారుకే దిగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అజ్గర్తో పాటు అతని సోదరులను అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్లు దిగిన కారుతో పాటు అజ్గర్ తీసుకొచ్చిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే సంఘటనా స్థలంలో కాల్పులకు సంబంధించిన ఆధారాలేవీ లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించడం గమనార్హం. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించగా.. కాల్పులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ఈ ఘటనకు ముందు అజ్గర్ సోదరులు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు సమీపంలో రూ.3 కోట్లు విలువ చేసే ఉమ్మడి ఆస్తిని అజ్గర్ ఒక్కడే కాజేయాలని చూస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.గతంలో ఉమ్మడి ఆస్తి అయిన 2 ఎకరాల భూమిని తమకు తెలియకుండానే అమ్ముకున్నాడని ఆరోపించారు.పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతుండగానే కాల్పుల ఘటన చోటు చేసుకుంది.