ఆ చోరీతో సంబంధం లేదు.. నోరువిప్పిన మంత్రి కాకాణి, అనిల్తో విభేదాలు లేవట
నెల్లూరు కోర్టులో చోరీ అంశంపై దుమారం కొనసాగుతుంది. చోరీ జరిగి.. దొంగల పని ఎస్పీ చెప్పడంతో విమర్శలకు ఆజ్యం పోసినట్టయ్యింది. టీడీపీ నేతలు అయితే మంత్రి కాకాణి గోవర్ధన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. దీంతో మంత్రి స్పందించారు. నెల్లూరు కోర్టులో చోరీ గురించి మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ అంశంపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. హైకోర్టుకు వెళ్లొచ్చని, లేదంటే సీబీఐతో విచారణ జరిపించుచ్చని కామెంట్ చేశారు.
ఏ విచారణకైనా సిద్దం..
ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నానని కాకాణి గోవర్దన్ అన్నారు. ప్రభుత్వ విచారణ కూడా జరిపించుకోవచ్చని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎవరితో భేదాభిప్రాయాలు లేవని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. కోర్టు ఫైల్స్ చోరీ వెనుక కుట్ర ఉందన్నారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
తనను బద్నాం చేయడానికే... కోర్టులో ఫైల్స్ చోరీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆరోపణ చేసేవారు సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని కోరారు. తాను సీబీఐ విచారణను స్వాగతిస్తానన్నారు.
అనిల్తో విభేదాలు లేవే..
మాజీ మంత్రి అనిల్కుమార్తో తనకు విభేదాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. అందరినీ కలుస్తామని, ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పుడు విద్రోహులు ప్రవేశిస్తారని చెప్పారు. తన ప్లెక్సీలు చించి అనిల్కుమార్ యాదవ్పై... అనిల్ ప్లెక్సీలు చించి తనపై ఆరోపణలు చేస్తారన్నారు. ఆనం వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
చోరీ కలకలం
నెల్లూరులో గల కోర్టు ఆవరణలో 4వ అదనపు కోర్టులో గురువారం చోరీ జరిగింది. పలు కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని ప్రచారం జరుగుతోంది.
కాకాణి కేసు పత్రాలు మాయం
మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు.
ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ పత్రాలు కనిపించకుండా పోయాయి. దొంగతనం జరిగినా.. పత్రాలు మాత్రం రికవరీ జరగలేదు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. కాకాణి స్పందించారు. ఏ విచారణకైనా సిద్దమని ప్రకటంచారు.