ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ఇవ్వండి-కేసీఆర్కు బండి లేఖ-రేపటి కేబినెట్ భేటీలో ఆ నిర్ణయం ఉంటుందా?
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ ప్రదర్శిస్తున్న అలసత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎప్పుడో గతేడాది డిసెంబర్లో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని ఊరించిన ప్రభుత్వం... ఇప్పటికీ దాన్ని అమలుచేయలేదు. దీంతో కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇక రావనే అభిప్రాయానికి నిరుద్యోగులు వస్తున్నారు. నిరుద్యోగ యువత,ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా... ఈ విషయంలో సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్...
బహిరంగ లేఖలో నిరుద్యోగ సమస్యలు,నిరుద్యోగ భృతి,ఉద్యోగ నోటిఫికేషన్ల అంశాన్ని సంజయ్ ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భృతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినకేసీఆర్... ఆ తర్వాత మాట నిలుపుకోలేదన్నారు. కానీ తన కుటుంబంలో,బంధువర్గంలో డజను మందికి ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. తెలంగాణలో ప్రతీ నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద రూ.లక్ష చొప్పున ప్రభుత్వం బకాయి పడిందన్నారు.ఆ బకాయిలను వెంటనే నిరుద్యోగులకు అందించాలన్నారు.
రేపటి కేబినెట్ భేటీలో అయినా నిర్ణయం ఉంటుందా?
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం(సెప్టెంబర్ 16) జరిగే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ, వాటికి సం బంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే గతంలోనూ సీఎం కేసీఆర్ ఉద్యోగాల అంశంపై చర్చించడం.. ఖాళీల లెక్కలు అసమగ్రంగా ఉన్నాయంటూ దాన్ని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఇప్పుడైనా ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
ఖాళీల లెక్క తేల్చేందుకు... సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ...
రాష్ట్రంలో అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియ... ఇదంతా సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే అన్నీ కొలిక్కి రావడంతో 65వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై రేపటి మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అంటున్నాయి. 50 వేల నుంచి 65వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలు కూడా రేపటి కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
నీళ్లు-నిధులు-నియమాకాలు... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు-నిధులు-నియమాకాలు ప్రాతిపదికన.కానీ స్వరాష్ట్రంలో ఈ 3 అంశాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంతో కరెంట్ బిల్లుల మోత తప్ప పెద్దగా ప్రయోజనమేమీ లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నిధుల విషయానికొస్తే.. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూరుకుందనే విమర్శలున్నాయి. నియామకాల సంగతి సరేసరి. ప్రభుత్వం తాము 1లక్ష పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతుండగా... నిరుద్యోగ యువత,ప్రతిపక్షాలు మాత్రం ఆ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేవలం 30వేల పైచిలుకు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని వారు చెబుతున్నారు.
ప్రభుత్వానికి ఎందుకీ అలసత్వం...
కొలువుల భర్తీ విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా సీఎం కేసీఆర్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అడపాదడపా దానిపై రివ్యూ చేయడం ఖాళీల లెక్కలు సరిగా లేవని ఆ ఫైల్ను పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ఉద్దేశం అసలు ఉందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఆ అంశాన్ని తెరపైకి తీసుకురావడం.. ఆ తర్వాత దాన్ని మరిచిపోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే... 50వేల ఉద్యోగాల భర్తీకి 11 నెలలు గడిచినా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమేంటనే ప్రశ్న తలెత్తకమానదు.
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కళ్లు తెరవట్లేదు. గతేడాది డిసెంబర్ మాసంలో త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ప్రకటన రాగానే వేలాది మంది విద్యార్థులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు.కొంతమంది హైదరాబాద్,కరీంనగర్,వరంగల్,ఖమ్మం లాంటి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యారు. ఇంతలోనే కరోనా లాక్ డౌన్,అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు,సాగర్ ఉపఎన్నికతో నోటిఫికేషన్లు వాయిదాపడ్డాయి. హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో ప్రభుత్వం మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్లపై అడపాదడపా సమీక్షలు,త్వరలోనే నోటిఫికేషన్లు అంటూ ప్రకటనలు చేసింది. కానీ ఇంతవరకూ దానికి మోక్షం కలగలేదు. దీంతో ప్రిపరేషన్ సాగిస్తున్న విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇప్పట్లో నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా అన్న మీమాంస వారిని వెంటాడుతోంది.