ఎంసెట్ లీక్: జేఎన్టీయూ ఉద్యోగుల పాత్ర, వారే ప్రింట్ చేరవేశారా?
హైదరాబాద్: ఎంసెట్ 2 లీక్ అంశం తెలంగాణ విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనలో ముంచింది. లీక్ వ్యవహారంలో కీలక నిందితులు రాజగోపాల్, రమేష్, విష్ణు, తిరుమల్లను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. గురువారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 7గురు అరెస్టయ్యారు.
ఎంసెట్ లీక్- తెలివిగా డీల్, శిక్షణ కూడా: ఎవరీ రాజగోపాల్?
కాగా, ఎంసెట్ లీక్ వ్యవహారంలో ముగ్గురు జేఎన్టీయూ ఉద్యోగుల పైన అనుమానాలు కలుగుతున్నాయి. ఎంసెట్ నిర్వహణ దానికి కొత్తేం కాదు. అయితే, పరీక్షల నిర్వహణలో తిరుగులేదన్న ధీమాతో ఆ వర్సిటీ నిర్లిప్తంగా వ్యవహరించడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోటీ పరీక్షల నిర్వహించడంలో జేఎన్టీయూకు మంచి పేరు సంపాదించడంతో పలు శాఖలు ఉద్యోగ పరీక్షలను నిర్వహించే బాధ్యతను సైతం ఆ వర్సిటీకే అప్పగించాయి. అయితే, తాజాగా ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం విశ్వవిద్యాలయానికి మాయని మచ్చగా మారనుంది.
ఎంసెట్ 2: మంత్రి వద్ద విద్యార్థుల కంటతడి, ఎంసెట్ 1 కూడా
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ నిరోధం పైనే జేఎన్టీయూ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ వస్తోంది. అయితే, నిర్లిప్తత వల్లే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, ముగ్గురు జేఎన్టీయూ ఉద్యోగులకు కీలక నిందితుడు రాజగోపాల్ రెడ్డి మనుషులతో పరిచయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే పేపర్ తయారీ, ముద్రణను రాజగోపాల్కు చేరివేసినట్లుగా అనుమానిస్తున్నారు.
ఎంసెట్ లీక్ అంశంపై మంత్రి కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో మాట్లాడారు. లీకేజీ పైన సీఐడీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులకు అన్యాయం జరగనివ్మని చెప్పారు. వీసీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ.. అప్పుడే దీనిపై మాట్లాడలేమన్నారు.