జగన్ కేసు: మాజీ మంత్రులు సబితా, ధర్మానపై సిబిఐ ఛార్జీషీటు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్కు సున్నపురాయి గనుల కేటాయింపులో వైయస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, అందులో పేర్కొంది.
అంతేగాక, వైయస్ కేబినెట్లో రెవెన్యూ, మైనింగ్ శాఖల మంత్రులుగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చూపుతూ అభియోగాలు మోపింది. వీరితోపాటు రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శామ్యూల్, మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, అనంతపురం జిల్లా అప్పటి డీఆర్వో సుదర్శనరెడ్డి, యాడికి ఎమ్మార్వో ఎల్లమ్మ తదితరులపై అభియోగాలతో సీబీఐ అధికారులు అనుబంధ చార్జిషీటు దాఖలు చేశారు.
వైయస్ ప్రభుత్వ హయాంలో తనయుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేవిధంగా మైనింగ్ కేటాయింపుల్లో నిర్ణయాలు జరిగాయని సీబీఐ తేల్చింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తాండూరు, ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి, కర్నూలు జిల్లాల్లో నిబంధనలను తుంగలో తొక్కి పెన్నా సిమెంట్స్కి మైనింగ్ కేటాయింపులు జరిగాయంటూ గగనవిహార్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జీషీటు దాఖలు చేసింది.
2008లో తాండూరులో 1021 ఎకరాల మైనింగ్ లీజులను పునరుద్ధరించాలని వాల్చంద్ కంపెనీ దరఖాస్తు చేసుకోగా కుదరదని చెప్పిన వైయస్ ప్రభుత్వం... వాల్చంద్ కంపెనీని పెన్నా సిమెంట్స్ కొనుగోలు చేయగానే తాండూరు మైనింగ్ లీజులను పునరుద్ధరించింది. దీంతోపాటు కర్నూలు జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని కాదని పెన్నా సిమెంట్స్ కంపెనీకి 760 ఎకరాలు, అనంతపురంలోని యాడికిలో 230 ఎకరాల అసైన్డ భూములను వైయస్ ప్రభుత్వ కేటాయించింది.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లీజుల కేటాయింపులకు ప్రతిఫలంగా వైయస్ తనయుడు జగన్ కంపెనీల్లో పెన్నా గ్రూప్ రూ.68 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ గతంలో పెన్నా ప్రతాపరెడ్డితో సహా 9మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది.