పైలట్ రోహిత్ రెడ్డిని 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ: ఎమ్మెల్యే ఆశ్చర్యం, 27న మళ్లీ హాజరు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ రెండో ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 7 గంటలపాటు ఎమ్మెల్యేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా రోహిత్ రెడ్డి సమర్పించిన ఆధారాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
రోహిత్ రెడ్డి ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్స్ పై ఆరాతీశారు అధికారులు. రోహిత్ కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాలు, కంపెనీ వివరాలపై ప్రశ్నించారు. 17 బ్యాంక్ ఖాతాలు, 3 లాకర్ల వివరాలతో ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. దీంతో అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించారు. తన వ్యక్తిగత కేసుల వివరాలను కూడా ఈడీ అధికారులకు రోహిత్ రెడ్డి అధికారులు అందజేసినట్లు తెలిసింది.
ఈడీ విచారణ అనంతరం పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి ప్రశ్నలు వేశారని చెప్పారు. కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే ఈడీ ప్రశ్నలు అడిగిందని, తాను కూడా విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు. అయితే, తాను ఈ కేసులో ఫిర్యాదు చేస్తే.. తనను ప్రశ్నించడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.
అంతేగాక, తన వ్యక్తిగత వివరాలు, ఫ్యామిలీ, విదేశీ టూర్లు, ఆస్తులు, వ్యాపారాల వివరాలను ఈడీ అధికారులు అడిగారని రోహిత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ఈడీ ఎందుకు విచారిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తనను మళ్లీ డిసెంబర్ 27న విచారణకు రావాలని ఈడీ చెప్పిందన్నారు. మిగతా విషయాలు బుధవరాం వెల్లడిస్తానని రోహిత్ రెడ్డి చెప్పారు.