విచ్చలవిడిగా గన్ లైసెన్సులు; మాకేమైనా జరిగితే.. వైఎస్ షర్మిలపై ఫిర్యాదుపైనా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారని, తనకు గాని, తన కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. నాది కాని, నా కుటుంబ సభ్యులది కానీ ఒక్క రక్తపు బొట్టు కారినా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కెసిఆర్ ని ఓడించేంతవరకు తాను నిద్ర పోనంటూ ఈటల రాజేందర్ శపథం చేశారు.
కేసీఆర్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అవసరాల కోసం ఉన్న వారే
ప్రస్తుతం కెసిఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అవసరాల కోసం ఉన్న వారేనని, కొద్ది రోజులు ఆగితే వారంతా టిఆర్ఎస్ నుండి బీజేపీ కి క్యూ కడతారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్న ఈటల రాజేందర్ సభా హక్కులను కాపాడవలసిన స్పీకర్ సభా హక్కులను కాలరాశారు అంటూ విమర్శించారు. సభ జరిగిన తీరును కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకపోవడం సిగ్గుచేటని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
కేసీఆర్ నోరు తెరిస్తే చండాలమే
ప్రధాని కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సంస్కారహీనుడు, అబద్దాలకోరు సీఎం కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు ఈటల రాజేందర్. నోరు తెరిస్తే చండాలంగా మాట్లాడే వ్యక్తి సీఎం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ షర్మిల భాషపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం దిక్కుమాలిన చర్య అని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు కానీ ప్రత్యర్థి పార్టీల నేతలు మాట్లాడితే నేరంగా చూస్తున్నారంటూ మండిపడ్డారు.
కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు భయపడను
బిఎసి సమావేశానికి బిజెపి ని ఎందుకు పిలవడం లేదని అడిగితే సమాధానం చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా తనను బెదిరించే ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నయీం ముఠా సభ్యుల బెదిరింపులను తాను ఖాతరు చేయలేదని, కెసిఆర్ తాటాకు చప్పుళ్ళకు భయపడే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ కు దమ్ముంటే ప్రజా తీర్పును కోరడానికి రావాలని సవాల్ విసిరారు.
నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కు బుద్ధి చెప్పి తీరుతారని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.