కృష్ణా జిల్లాలో విషాదం.. మునేరులో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులు పిల్లల పాలిట మృత్యువైంది. మునేరులో ఈతకు దిగిన ఐదురుగు విద్యార్థులు గల్లంతై విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన చందర్లపాడు మండలం, ఏటూరులో చోటు చేసుకుంది. వీరి వయస్సు పట్టుమని 14 ఏళ్లు కూడా లేవు. కూలి నాలి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రుల రోదనలు కలిచివేస్తున్నాయి. ఆడుతూ పాడుతూ.. అందరితో చలాకీగా ఉండే ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి.
మునేరులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
సంక్రాంతి సెలవులు వచ్చాయన్న సంతోషంతో మునేరులో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులను మృత్యువు కబలించింది. గల్లంతైన పిల్లలు విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం, ఏటూరులో చోటుచేసుకుంది. జెడ్పీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి గురజాల చరణ్ ( 14), ఏడో తరగతి చదువుతున్న జెట్టి అజయ్ (12) , కర్ల బాలయేసు (12), మాగులూరి సన్నీ ( 12), ఆరో తరగతి చదువుతున్న మైలా రాకేష్ ( 11) సోమవారం వారం మునేరులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు.
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
వ్యవసాయ పనుల కోసం పొలం వెళ్లి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించపోవడంతో గ్రామంలో వెతకం మొదలు పెట్టారు. విద్యార్ధులు మధ్యాహ్నం మునేరువైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో అక్కడకు వెళ్లి చూశారు. అక్కడ పిల్లల దుస్తులు, సైకిళ్లు కన్పించడంతో ఒక్క సారిగా తల్లితండ్రులు కుప్పకూలిపోయారు. తమ పిల్లలు ఏమైయ్యారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ పిల్లల ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం గాలింపు కొనసాగించారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సుశీలాదేవి, సీఐ నాగేంద్ర కుమార్, ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలసి వెళ్లి స్థానిక జాలర్ల సహాయంతో మునేరులో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది. విషయం తెలసుకున్న స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఘటనా స్థలానికి చేరుకుని, అధికారులతో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే ఏటూరు పంపాలని కోరారు. రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు.
ఏటూరులో విషాద చాయలు
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంగళవారం ఉదయం ఆ ఐదుగురి మృతదేహాలను గుర్తించి మునేరు నుంచి వెలికితీశారు. దీంతో ఒక్క సారిగా ఏటూరు గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈతకు వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూలి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రుల రోదనలు కలిచివేస్తున్నాయి. ఒకే గ్రామంలో ఐదుగురు చిన్నారులు చనిపోవడంతో విషాదచాయలు అలముకున్నాయి.