అనాధ శవాలకు అంతిమసంస్కారం.!ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం.!
హైదరాబాద్ : కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబసభ్యులు ముందుకురాని అభాగ్యులు, అనాధ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో అంతిమసంస్కారాలు నిర్వహించాలనే బృహత్కర నిర్ణయం తీసుకున్నారు ట్రస్టు ముఖ్య నిర్వాహకులు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వివిధ ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడం, కొన్నిచోట్ల కరోనాతో మృతిచెందిన వారిని పట్టించుకోకుండా రోడ్ల పక్కన వదిలివేయడం వంటి ఘటనలకు కలత చెందిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కరోనా మృతుల చివరి మజిలీ గౌరవ ప్రదంగా సాగేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని ట్రస్ట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలోని రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు కరోనా బాధితులకోసం విదేశీ వైద్యులతో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఆన్ లైన్ టెలీ మెడిసిన్, ఉచితంగా మందుల పంపిణీ, కోవిద్ బాధితులకు అన్నదానం కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన 24/7 కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు అవసమైన సేవలను అందిస్తున్నారు.